కుటుంబ సభ్యులు పరామర్శించిన సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్
విశాలాంధ్ర- అనంతపురం : అనంత పట్టణంలోని గుత్తి రోడ్ ఎల్లమ్మ కాలనీలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 6 మంది యాక్సిడెంట్ లో మరణించడంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు అలీ సాహెబ్ (60), ఫిరోజ్ బాషా (28), జహిద (30), రెహనా (45), ఆహిల్ (5), హయాన్ (3) వయసు గలవారు హైదరాబాదు నుంచి అనంతపూర్ కి వస్తున్నప్పుడు ఉదయం గుత్తి రోడ్డు వద్ద యాక్సిడెంట్ జరగడంతో మృతి చెందారన్నారు. మృతి చెందిన వారిలో ఒకరైన ఫిరోజ్ బాషా కు జూన్ 27న పెండ్లి ఉండడంతో తన కుటుంబ సభ్యులతో అనంతపూర్ నుంచి మారుతి ఆల్టో కారులో శుక్రవారం ఉదయం హైదరాబాదుకు పెండ్లి బట్టలు కొనడానికి వెళ్లడం జరిగిందన్నారు. తిరిగి హైదరాబాదు నుంచి అనంతపూర్ వస్తుండగా గుత్తి దగ్గర కారు ప్రమాదం జరగడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదు మంది అక్కడికక్కడే మరణించారు. తీవ్ర గాయాలతో బయటపడిన జాహిద్ అను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలిస్తుండగా జాహిద మరణించడం జరిగిందన్నారు. కారు నడుపుతున్న కుటుంబ సభ్యుల్లో ఒకరైన మహమ్మద్ గౌస్ తలకు గాయాలు బయటపడినట్లు వారు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ హుటాహుటిన ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సందర్శించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తో ఫోన్లో మాట్లాడి ఇతర కార్యక్రమాలను పూర్తిచేయాలని కోరారు. ఒకే కుటుంబానికి చెందిన యాక్సిడెంట్ లో మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సి. లింగమయ్య, నగర కార్యదర్శి ఎన్. శ్రీరాములు, నగర సహాయ కార్యదర్శి అలిపిర,ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి కుల్లాయి స్వామి తదితరులు పాల్గొన్నారు.