విశాలాంధ్ర-ఉరవకొండ : అన్ని విధాలుగా నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్, తాలూకా కార్యదర్శి మనోహర్ పేర్కొన్నారు. మంగళవారం ఉరవకొండ మండలం చిన్న మస్తురు గ్రామంలోని సచివాలయ కార్యదర్శి కి రైతు సమస్యలపై విన్నతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వ తరహాలో ప్రతి రైతుకు ఎకరాకు 10 వేలు రూపాయలు ఇవ్వాలని రైతు రుణాలను మాఫీ చేయాలని ఆత్మహత్యలను నివారించాలని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ప్రతి రైతుకు రూ, 20 వేల వరకు పెట్టుబడి సాయం అందించాలని డా.స్వామినాధన్ కమీషన్ సిఫార్సులు అమలు చేయాలన్నారు. కౌలు రైతులను కూడా అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఉపకరణాలను 90 శాతం సబ్సిడీతో అందించాలని అన్నారు.50 సంవత్సరాలు పైబడిన రైతులకు ప్రతి నెల ఫింఛన్ మంజూరు చేయాలని, వ్యవసాయ విద్యత్ మోటార్లకు మీటర్లు బిగించాలనే ఆలోచనను ఉపసంహరించుకొని ఉచిత విద్యుత్ను కొనసాగించాలని తెలిపారు.గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని అన్నారు. భూయజమాని ప్రమోయం లేకుండానే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.