విశాలాంధ్ర- ఉరవకొండ : ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్ధర్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. సోమవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు శివన్న, చెన్నా రాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు విజయభాస్కర్ మాజీ సర్పంచ్ మోపిడి గోవిందు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం గద్ధర్ పోరాడారని తన ఆట పాటలతో అందరినీ కదిలించారని ప్రశంసించారు. తన గళంతో కోట్లాది మందిని చైతన్యపరిచిన గద్ధర్ మృతి తీరని లోటని పేర్కొన్నారు.
యువ ఉద్యమకారులలో ఉత్సాహాన్ని ఉరకలు వేసేలా స్టేజ్ ల మీద పోగ్రాములను చేస్తూ.. ఇటు ఉద్యమ సినిమాలకు కూడా ఆయన పాటలు రాశారన్నారు. ఉద్యమ పాటల ద్వారా ఆయన ప్రజలకు ఇంకా త్వరగా చేరువయ్యారని గుర్తుకు చేశారు. గద్దర్ రాసి బండెనక బండి కట్టి పాట ఇప్పటికీ జన హృదయాల్లో నిలిచిపోయిందన్నారు. దేశంలో బడా పారిశ్రామిక వేతలు, మరియు అవినీతి రాజకీయ నాయకులు యొక్క దుర్మార్గాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో పాటలు పాడారని కొనియాడారు. గద్దర్ కు ఉరవకొండ ప్రాంతంలో అవినాభావ సంబంధాలు ఉన్నాయన్నారు. నియోజకవర్గంలో చాబాల గ్రామంలో 40 రోజులు పాటు విప్లవ గీతాలు, రాజకీయ శిక్షణ తరగతులు ఇవ్వడానికి ఆయన హాజరయ్యారని వారు తెలిపారు. ఆయన నింపిన చైతన్యంతోనే ఉరవకొండ ప్రాంతంలో అనేకమంది యువత వామపక్ష భావజాలానికి ఆకర్షితులయ్యారని కొనియాడారు. ఆయన మృతి దేశంలోనే వామపక్ష పార్టీలకు సానుభూతిపరులకు తీరని నష్టం జరిగిందన్నారు. ఆయన యొక్క గొప్ప ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ వజ్రకరూరు కార్యదర్శి సుల్తాన్, ఉరవకొండ కార్యదర్శి తలారి మల్లికార్జున, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు వార్డ్ సభ్యులు అయినా రామాంజనేయులు, గోపాల్ తదితరులు ఈ సంతాప సభ కార్యక్రమంలో పాల్గొన్నారు.