ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న ఏలూరు శాసనసభా నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారం ప్రజాభిమానులతో ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. బండి విజయం కోసం సీపీఐ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సీపీఐ, సీపీిఎం, కాంగ్రెస్ శ్రేణులు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తిరిగి కంకి కొడవలి గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సీపీఐలో గత 40 సంవత్సరాలుగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న బండి వెంకటేశ్వరరావును గెలిపించడం ద్వారా ఏలూరు నగరాభివృద్ధికి చట్టసభలలో ప్రజావాణి వినిపించే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
నగరానికి చిరపరిచితులు..
ఇండియా కూటమి నుంచి ఏలూరు అసెంబ్లీ బరిలో ఉన్న కార్మిక నేత బండి వెంకటేశ్వరరావు నియోజకవర్గంలో అన్నిచోట్ల ఆయనకు పరిచయాలు ఎక్కువ. స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, సీపీఐ కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు తనకున్న బలాలుగా బండి వెంకటేశ్వరరావు భావిస్తున్నారు. విభజన తర్వాత ఏపీికి బీజేపీ చేసిన అన్యాయాన్ని కూటమి పేరుతో బీజేపీ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను బీజేపీితో అంటకాగుతున్న వైసీపీి, టీడీపీి, జనసేన వైఖరులను ప్రజల
ముందుకు తీసుకు వెళుతున్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి ఇండియా కూటమి మాత్రమే దిక్సూచి అని ప్రచారం చేయడంలో అగ్రభాగాన ఉన్నారు. బండి వెంకటేశ్వరరావు కార్మికనేతగా, వ్యవసాయ కార్మిక సంఘం తోపాటు పలు ప్రజా సంఘాలకు బాధ్యులుగా ఉంటూ తాను శాసనసభ్యునిగా గెలుపొందితే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మరింత కృషి చేస్తానని ప్రచారంలో భరోసా కల్పిస్తున్నారు.
అన్ని వర్గాల నుంచి ఆదరణ
ఎన్నికల ప్రచారానికి రెండు రోజులు మాత్రమే ఉండడంతో బండి వెంకటేశ్వరరావు ప్రచారాన్ని ఉధృతం చేశారు. గత పాలకుల వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఎన్డీయే కూటమి, నిరంకుశ వైసీపీి ప్రభుత్వాలు మరోసారి అధికారంలోకి వస్తే ఎదురయ్యే సవాళ్లను వివరిస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రతిబింబించేందుకు చట్టసభలలో తన వంటి ప్రతినిధులు ఉండాలని, తనను గెలిపిస్తే ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు సభలో నిలదీస్తానని హామీ ఇస్తున్నారు. బండికి అన్ని తరగతుల వారు ఆదరణ కనబరుస్తున్నారు. ప్రచారంలో నగరంలోని మహిళలు బండి వెంకటేశ్వరరావుకు హారతులు ఇచ్చి పూలమాలలతో స్వాగతం పలుకుతున్నారు.
అగ్రనేతల ప్రచారం…
బండి వెంకటేశ్వరరావు తరపున ఇప్పటికే సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రోడ్ షోల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు. నగరంలో చిరు వ్యాపారులు, మహిళలు, ఆటో కార్మికులు, బంగారు నగల వ్యాపారస్తులు, తటస్తులతో పాటు అన్ని తరగతుల ప్రజలను వారు కలిసి బండి వెంకటేశ్వరరావుకు కంకి కొడవలి గుర్తుపై ఓట్లు వేసి చట్టసభలకు పంపి ఏలూరు నగరం అభివృద్ధి చెందేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రచారంలో అనేక చోట్ల సభలు నిర్వహించి గత పది ఏళ్లలో బీజేపీి వివిధ సందర్భాలలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులకు వైసీపీి, టీడీపీ బేషరతుగా మద్దతు పలకడం, మైనారిటీలు, క్రిస్టియన్లు పట్ల బీజేపీ అనుసరిస్తున్న విధానాలను అందరికీ అర్ధమయ్యే రీతిలో ప్రచారం నిర్వహించారు. బీజేపీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని, దానితో అంట కాగుతున్న టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల వైఖరులను నారాయణ, రామకృష్ణ ఆయా సభలలో వివరించారు. దీంతో ప్రజలు వివేచనతో ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. వీరి పర్యటన అనంతరం బండి ప్రచారం వేడెక్కింది. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారాన్ని సమీక్షిస్తున్నారు. ఏలూరు అసెంబ్లీ బరిలో ఎన్డీయే కూటమి తరుపున బడేటి రాధాకృష్ణయ్య (చంటి), వైసీపీ తరఫున ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), బరిలో ఉన్నారు.
` విశాలాంధ్ర బ్యూరో ఏలూరు