వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సోమవారం మరచిపోలేని రోజుగా గుర్తుంటుంది. తీవ్రంగా భయపెట్టిన ఓ కోర్టు కేసులో ఆయనకు ఊరట లభించగా… మరోవైపు ఒక్కసారిగా ఆయన జీవితంలో ఎన్నడూ లేనంత సంపద వచ్చి చేరింది. ట్రంప్నకు భారీ జరిమానా విధింపు విషయంలో పై కోర్టులో ఊరట లభించింది. అదే సమయంలో కొన్నేళ్లుగా పెండిరగ్లో ఉన్న ఆయన కంపెనీ డీల్ ఒకటి పూర్తయింది. ఫలితంగా ఆయన ఆస్తుల విలువ భారీగా పెరిగింది. దీంతో బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లోని తొలి 500 మంది సంపన్నుల జాబితాలో ఆయన స్థానం దక్కించుకున్నారు. తాజా అంచనాల ప్రకారం ట్రంప్ సంపద విలువ 4 బిలియన్ డాలర్లు (రూ.33 వేల కోట్లు) పెరిగి 6.5 బిలియన్ డాలర్లకు చేరింది. గతంలో ఎన్నడూ ఆయన ఆస్తుల విలువ ఈ స్థాయిలో లేదని యూఎస్ఏ టుడే పేర్కొంది. తన సంపద గురించి గతంలో అసత్యాలు చెప్పిన కేసులో దిగువ కోర్టు విధించిన రూ.3,788 కోట్ల (45.4 కోట్ల డాలర్ల) భారీ జరిమానాను నిలిపివేయాలని కోరుతూ రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ అప్పీల్స్ కోర్టును ఇటీవల ఆశ్రయించారు. అయితే, దిగువ కోర్టు ఉత్తర్వు అమలు కాకుండా నిలిపివేయటానికి అప్పీల్స్ న్యాయస్థానం ఓ షరతు విధించింది. పది రోజుల్లో రూ.1,460 కోట్ల(17.5కోట్ల డాలర్ల)ను చెల్లించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని జమ చేసినట్లయితే రూ.3,788 కోట్లను వసూలు చేయకుండా నిలుపుదల ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ట్రంప్నకు చెందిన సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’ సంస్థ డిజిటల్ వరల్డ్ అక్విజేషన్ కార్ప్(డీడబ్ల్యూఏసీ)తో విలీనం ప్రక్రియ పూర్తయింది. ఇది దాదాపు 29 నెలలుగా సాగుతూ వస్తోంది. మార్కెట్లో డీడబ్ల్యూఏసీ షేర్లు ఒకేసారి 35 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. దీంతో ట్రంప్ సంపద కూడా భారీగా పెరిగి 6.5 బిలియన్ డాలర్లకు చేరినట్లు సీఎన్బీసీ పేర్కొంది. విలీనం తర్వాత ఏర్పడ్డ కొత్త కంపెనీ మంగళవారం నుంచి నాస్డాక్లో డీజేటీ పేరిట ట్రేడిరగ్ అయింది. అయితే ఈ నూతన కంపెనీలో వాటాలను ట్రంప్ కనీసం ఆరు నెలల పాటు విక్రయించకుండా ఉండాల్సి ఉంటుంది.