యూనస్ వెల్లడి
వాషింగ్టన్: రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్ను నిప్పుల కుంపటిగా మార్చడంతో షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి దిగిపోయి భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు, హసీనాను దింపడం పథకం ప్రకారం జరిగిన కుట్ర అని ఆ దేశ తాత్కాలిక సారథి మహ్మద్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన ఈ విధంగా స్పందించారు. క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆ సమయంలో అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఉన్నారు. యూనస్ మాట్లాడుతూ విద్యార్థి నాయకులు బంగ్లాదేశ్కు కొత్త రూపు తీసుకువచ్చారని కొనియాడారు. హసీనాను పదవి నుంచి దింపే కుట్ర వెనక ఎవరున్నారో బయటకు రాలేదని, కానీ మహఫుజ్ అబ్దుల్లా పాత్ర ఉండొచ్చని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగింది కాదని, ప్రణాళిక ప్రకారం జరిగిందని అన్నారు. ఇదిలా ఉంటే.. హసీనాను దించే కుట్రలో అమెరికా పేరు కూడా వినిపించింది. పదవి నుంచి దిగిపోవడానికి ముందు మేలో హసీనా చేసిన ప్రకటన అందుకు కారణమైంది. బంగ్లాదేశ్కు చెందిన సెయింట్ మార్టిన్ దీవిలో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ఒక దేశానికి అనుమతిస్తే… తన ఎన్నిక సాఫీగా జరిగేటట్లు చేస్తానని ప్రతిపాదించినట్లు ఆమె చెప్పారు. ఆ ప్రకటన ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికానే ఆ దేశం అయి ఉంటుందనే ప్రచారం జరిగింది. మరోపక్క… ఈ ఏడాది జనవరిలో జరిగిన బంగ్లా ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా సాగలేదని గతంలో అమెరికా విదేశాంగశాఖ వ్యాఖ్యానించింది.