దేశంలో 60రోజుల ఎమర్జెన్సీ ప్రకటన
యథావిథిగా 20న అధ్యక్ష ఎన్నికలు
క్విటో: ఈక్వెడార్ అధ్యక్ష అభ్యర్థి ఫెర్నాండో విల్లావిసెన్షీయో హత్యకు గురయ్యారు. దక్షిణ అమెరికా దేశంలో హింస పేట్రేగిన వేళ సంస్థాగత నేరాలు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజధానిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఫెర్నాండోను దుండగులు కాల్చి చంపారు. ఆయన మరణించినట్లు నేషనల్ ఎలక్టోరల్ కౌన్సిల్ హెడ్ డయానా అటామైట్ గురువారం ధ్రువీకరించారు.
ఫెర్నాండో హత్యతో దేశంలో 60 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని దేశాధ్యక్షుడు గ్యుల్లెర్మో లాసో ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికలు యథావిధిగా ఈనెల 20న జరుగుతాయన్నారు. ఫెర్నాండో హంతకులను వదిలిపెట్టమని, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాల్చివేతకు గురికాక ముందు ఫెర్నాండో మాట్లాడుతూ తనకు అనేక బెదిరింపులు వచ్చాయని, మెక్సికోలోని సినాలావో కార్టల్ నేతలు కూడా చంపేస్తామని హెచ్చరించారని చెప్పారు.
అధ్యక్ష బరిలో ఉన్న ఎనిమిది మంది అభ్యర్థుల్లో ఫెర్నాండో ఒకరు. బిల్డ్ ఈక్వెడార్ మూవ్మెంట్ తరపు అభ్యర్థి. 59ఏళ్ల ఫెర్నాండోకు భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. అనుమానితుడిని అధికారులు అదుపులోకి తీసుకోగా తీవ్ర గాయాలతో అతను చనిపోయినట్లు ఈక్వెడార్ అటార్నీ జనరల్ కార్యాలయం వెల్లడిరచింది. సామాజిక మాధ్యమాల్లో వైరలైన వీడియోలో ఫెర్నాండో తన భద్రతా సిబ్బందితో కలిసి కార్యక్రమం నుంచి నిష్క్రమించడం, తెల్లరంగు ట్రక్కు వద్దకు చేరుకున్నప్పుడు కాల్పులు జరగడం, జనం కేకలు వేస్తూ అటూ ఇటూ పరుగులు తీయడం వంటి దృశ్యాలు ఉన్నాయి. ప్రశాంతంగా ఉండే ఈక్వెడార్లో గతేడాది నుంచి హింస పేట్రేగింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారుల బెడద పెరిగింది.
ఈక్వెడార్ కమ్యూనిస్టు పార్టీ ఖండన
అధ్యక్ష అభ్యర్థి ఫెర్నాండో విల్లావిసెన్షీయో ఎన్నికల ప్రచారమప్పుడు హత్యకు గురికావడాన్ని ఈక్వెడార్ కమ్యూనిస్టు పార్టీ (పీసీఈ) తీవ్రంగా ఖండిరచింది. నిష్పాక్షిక విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. అభ్యర్థులందరికి, రాజకీయ, పౌర సమాజ నాయకులకు అవసరమైన భద్రతా తదితర హామీలను ప్రభుత్వం నుంచి ఈక్వెడార్ ప్రజలతో కలిసి తాము డిమాండ్ చేస్తున్నట్లు ప్రకటనలో పీసీఈ ప్రధాన కార్యదర్శి విన్స్టన్ అలార్కాన్ ఎలిజాల్డే పేర్కొన్నారు. నేరాల అదుపునకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నేరాలకు వ్యతిరేకంగా ప్రగతిశీల, తిరుగుబాటు, ప్రజాస్వామిక దళాలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.