ఏథెన్స్: యూరప్ వ్యాప్తంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పెరిగిన ధరలు, వ్యయాలు, పన్నులు, రెడ్ టేప్, తీవ్రమైన పర్యావరణ నిబంధనలకు తోడు చౌకగా దిగుమతుల వల్ల పోటీ పెరుగుతుండటానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. గ్రీస్లోని రైతులు మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు పార్లమెంటు ఎదుట ధర్నా చేశారు. సింటాగ్మా స్క్వేర్ వద్ద ఆందోళనలో ఎనిమిది వేల మంది రైతులు, బీ కీపర్లు, లైవ్స్టాక్ బ్రీడర్లు పాల్గొన్నారు. ‘మేము చేయాల్సింది చేశాం, ఇక ఫలితం కోసం వేచివున్నాం’ అని నిరసనకారులు అన్నారు. వాతావరణ మార్పు, ఆకస్మిక వరదలు, తీవ్ర ఉష్ణోగ్రతలు, కార్చిచ్చు వంటివి తమ కష్టాలను మరింతగా పెంచాయని, తమ మనుగడ ప్రశ్నార్థకమైందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం తమకు అనుకూలంగా చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ‘ప్రస్తుతం ఏథెన్స్ నుంచి వెళ్లిపోతున్నాం కానీ గురువారం ఉద్యమ కార్యాచరణను నిర్ణయిస్తాం. ప్రభుత్వం మెడలు వంచి తమ డిమాండ్లు సాధించుకుంటాం’ అని సెంట్రల్ గ్రీస్లోని లారిస్సా నగరానికి చెందిన రైతుల సంఘం అధ్యక్షుడు రిజోస్ మరౌడస్ అన్నారు. కొన్ని వారులుగా రహదారుల, ప్రధాన కూడళ్లను దిగ్బంధించి తమ నిరసనను రైతులు తెలిపారు. మిట్సోటాకిస్ నేతృత్వ కన్జర్వేటివ్ ప్రభుత్వంతో ఆర్థిక సాయం కోసం చర్చలు జరిపారు. కానీ అవి సత్ఫలితాలు ఇవ్వలేదు. దీంతో తమ ఆందోళనలను రైతులు కొనసాగిస్తున్నారు.