వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో హాజరు కానున్నారు. అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆయన ఒకదాని తర్వాత ఒకటిగా కేసుల్లో చిక్కుకుంటున్నారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు యత్నించినట్లు తాజాగా కేసు నమోదైంది. బైడెన్ విజయానికి కాంగ్రెస్ ఆమోదాన్ని నిలువరించేందుకు 2021 జనవరిలో క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారన్న వాదన ఈ కేసు క్రమంలో బలంగా వినిపించింది. అంతేకాకుండా ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు వాంగ్మూలం ఇవ్వాలని కొందరు అధికారులను ట్రంప్ ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను కోర్టుకు హాజరు కావాలని వాషింగ్టన్ ఫెడరల్ కోర్టు ఆదేశించింది. ట్రంప్ ఇప్పటికే శృంగార తారకు డబ్బుల చెల్లింపు కేసులో, శ్వేతసౌధం రహస్య పత్రాలను తరలించిన కేసులో నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారు. జార్జియాలోనూ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై స్థానిక న్యాయస్థానంలో ట్రంప్పై కేసు ఉంది.