–ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శరత్ కుమార్
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : కాకినాడలో జులై 8,9,10 తేదీలలో జరుగుతున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శరత్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐవైఎఫ్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల కరపత్రాలను ఏఐవైఎఫ్ నాయకులు, విద్యార్థులు చేతులు మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా శరత్ కుమార్ మాట్లాడుతూ
విద్యార్థులకు చదువుతోపాటు రాజకీయాల పైన మరియు ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థి దశలోనే నేర్చుకోవాలని తెలిపారు. కేవలం చదివే కాకుండా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ సమాజంలో విద్యావ్యవస్థలో జరుగుతున్నటువంటి అవినీతిని వెలికితీయడానికి, అవినీతి అక్రమాల పైన పోరాటాలు చేయడానికి ఈ శిక్షణా తరగతులలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో రాష్ట్రంలో విద్యారంగంలో వస్తున్న మార్పులపై సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులపై విద్యార్థులలో చైతన్యం నింపడానికి విద్యార్థుల శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విద్య కాషాయీకరణ, విద్య ప్రైవేటీకరణ చేస్తూ నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలిపారు. పాలక ప్రభుత్వాలు విద్యార్థుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తూ విద్యార్థి వ్యతిరేక విధానాలను ఆవలంబిస్తున్నాయన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని, డిగ్రీ ప్రవేశాలను ఆన్లైన్ విధానాన్ని రద్దుచేసి ఆఫ్లైన్ విధానంలో కొనసాగించాలని, కేజీ టు పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈశ్వర్, మండల నాయకులు రాజు, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి రమేష్, నాయకులు దస్తగిరి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.