–పత్తికొండ డి.ఎస్.పి శ్రీనివాసరెడ్డి
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : కౌంటింగ్ సమయంలో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పత్తికొండ డి.ఎస్.పి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తో శాంతియుత సమావేశాన్ని సీఐ హనుమంతప్ప అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పత్తికొండ డి.ఎస్.పి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడుతూ మండలంలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగిందని, అదే వాతావరణంలో కౌంటింగ్ కూడా జరగాలన్నారు. రెచ్చగొట్టేలా ఎవరు వ్యవహరించవద్దని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమస్యాత్మక గ్రామాలలో పోలీసు సిబ్బందితో నిఘా ఉంచామని తెలిపారు. ఎన్నికల ఫలితాలు ఏ పార్టీలకు అనుకూలంగా ఉన్న సామరస్యంగా ఉండాలని సూచించారు. జూన్ 6వ తేదీ వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిషిద్ధమని, బాణసంచా కాల్చకూడదని డిఎస్పి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.