డాక్టర్ జీకేడీ ప్రసాద్
‘‘కులం పునాదుల మీద ఒక జాతిని కాని, నీతిని కాని నిర్మించలేరు. కులం పునాదులపై జరిగిన ఏ నిర్మాణంలోనైనా పగుళ్లు ఏర్పడతాయి. అది దీర్ఘకాలం మన్నజాలదు’’ అన్నారు తన ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ట్ గ్రంథంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్. దేశంలో నేడు ప్రభుత్వాల ఏర్పాటుకు కుల, మత సమీకరణలు కీలకపాత్ర పోషిస్తున్నాయన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ధన, వస్తు ప్రవాహంతో ఓటర్లను ప్రలోభపెడుతున్నారని రాజకీయపార్టీలే పరస్పరం దూషించుకుంటున్నాయి. నీతి, నియమావళిని పక్కనబెట్టి గెలుపుకోసం రాజకీయపార్టీలు అడ్డదారులు తొక్కుతున్న సంగతిని ఆయా పార్టీ శ్రేణులే పరస్పరం విమర్శించుకుంటున్నాయి. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్నికలు వస్తే డబ్బులొస్తాయని చూసే ఓటర్లు ఎక్కువ శాతం వున్నారని అభ్యర్థుల ఎన్నికల ఖర్చు చూస్తే తేటతెల్లం అవుతోంది. ధనికులు మాత్రమే ఎన్నికల్లో పోటీకి సమర్థులని పరిస్థితులు చెప్పకనే చెప్తున్నాయి. ఇదంతా జనరల్ సీట్లలోనే కాదు. ఎస్సీ, ఎస్టీల రిజర్వుడు స్థానాల్లో కూడా డబ్బుతో ఓట్లు కొనడం మరింత తీవ్రమైంది. అందుకు సమర్థులకే సీట్లు కేటాయిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల్లో ఉన్నతాధికారులుగా పదవీ విరమణ చేసిన వారిని, లేదా సర్వీసులో వున్నవారి చేత రాజీనామా చేయించి మరీ బరిలోకి దించుతున్నారు. ఈ కులాల నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయిన వారికి కొంతమంది బినామీలుగా వ్యవహరిస్తున్నారు. రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థులు ఎన్నికల ఖర్చుకోసం కోట్లలో పెట్టుబడిపెట్టేవారి చేతిలో కీలుబొమ్మల్లా మారిపోతున్నారు. ఆధిపత్య కులాల చేతుల్లో వున్న పార్టీల్లోనే కాదు దళితపార్టీల అభ్యర్థుల విషయంలోను ఇదే ధోరణి. ఈ నేపథ్యంలో రాజకీయ రిజర్వేషన్లు సామాజిక న్యాయాన్ని ఎలా సాకారం చేయగలవో సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోతుంది. ఆర్థిక లావాదేవీల్లో, వ్యాపారాల్లో బినామీల్లానే రాజకీయ బినామీలు అవతరించారని అర్థం చేసుకోవాలి. ఇలాంటి సందర్భంలోనే గాంధీ, అంబేద్కర్ల మధ్య జరిగిన పునా ఒడంబడిక గుర్తుకొస్తుంది. ఆనాడు డాక్టర్ అంబేద్కర్ ఎందుకు ప్రత్యేక నియోజక వర్గాలను డిమాండ్ చేశారో తెలుస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నియోజకవర్గాలు దక్కకపోయినా మహాత్మాగాంధీ సమ్మతితో జనాభా ప్రాతిపదికన లభించిన స్థానాలు విషయంలో కూడా బినామీలు చొరబడి ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారంటే సామాజిక న్యాయం ఇంకెక్కడ లభిస్తుందనే ప్రశ్న ఎస్సీ, ఎస్టీ ప్రజల్లో నెలకొంది.
కులాధిపత్య పార్టీలు రాజ్యాంగస్ఫూర్తితో కాకుండా ఎస్సీ, ఎస్టీలకు నామమాత్రంగా సీట్లు కేటాయిస్తున్నట్టుగా ఎన్నికల ప్రక్రియ మారిపోయినట్టు కనిపిస్తోంది. రిజర్వుడు స్థానాల నుంచి ఎంపికయిన అభ్యర్థులకు సొంత ఎజెండా ఏమీ లేకుండా పోతోంది. ఆయా పార్టీల మేనిఫెస్టోతోనే పెనవేసుకుపోవాలి. ఏది ఆచరణలోకి రాకపోయినా నోరు విప్పడానికి లేదు. ఎస్సీ, ఎస్టీలకు అత్యవసరమయిన సంక్షేమ పథకాల్ని తీసేసినా, మార్పు చేసినా మాట్లాడటానికి వీలులేదు. రిజర్వేషన్లు తగ్గించినా, అంచెలంచెలుగా తొలగిస్తున్నా తల ఊపాల్సివస్తుంది. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సంస్థలు ప్రైవేటు రంగంలోకి మారిపోవడాన్ని అలా చూస్తూ ముందుకు సాగిపోవాలి. పాఠశాల విద్య నుంచి విదేశీ విద్య వరకు మనుగుడలో వున్న సంక్షేమాన్ని తలకిందులు చేసినా ప్రభుత్వ వైఖరిని ఖండిరచడానికి లేదు. గోడలకు సున్నాలేసి అభివృద్ధి అనిపేరు పెడితే జేజేలు కొట్టుకుంటూ తిరగాలి. రాజకీయ బినామీలు ఎక్కడో మారుమూల గ్రామాల్లో సర్పంచ్లు మాత్రమే కాదు. అత్యున్నత చట్టసభల్లో కూడా ఇదే తీరు కొనసాగుతోంది. రోజు రోజుకూ ఈ పరిస్థితి తీవ్రమవుతోంది. దళిత పార్టీలు, దళితేతర పార్టీలతో పొత్తు పెట్టుకున్న సందర్భాల్లో కూడా ఓటు బదిలీ విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. దళిత పార్టీల నుంచి దళితేతర పార్టీలకు ఓటు బదిలీ అయిన శాతం కంటే దళితేతర పార్టీల నుంచి దళిత పార్టీలకు చాలా తక్కువ ఓటు శాతం మాత్రమే బదిలీ అవుతుంది. 2017 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్వాది, బీఎస్పీ పొత్తు సందర్భంలో ఇదే జరిగింది. వీటికి తోడు
పెత్తందారీలు, ఆధిపత్య కులాల నాయకులు స్థానిక ఎస్సీ, ఎస్టీ ప్రజల్ని ప్రజాప్రతినిధులుగా సహించలేక స్థానికేతర అభ్యర్థులను తీసుకొచ్చి పోటీలో నిలుపుతున్నాయి. ఉపకులాలకు సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ఆధిపత్య ధోరణికి పాల్పడుతున్నారు. ఈ విధంగా కూడా ఎస్సీ, ఎస్టీల రాజకీయ రిజర్వేషన్లను రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మలుస్తున్నారు. మాలలు అధికంగా వున్న చోట మాదిగ ఉపకులానికి చెందిన అభ్యర్ధిని, మాదిగలు అధికంగా వున్న చోట మాల కులానికి చెందిన అభ్యర్థిని పోటీలో నిలుపుతున్నారు. ఈ ధోరణి కూడా కులాల మధ్య కుంపటిగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్ని సృష్టించి తమ గెలుపుకి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రభుత్వాల్ని నడిపిన పార్టీలదీ, నడుపుతున్న పార్టీలదీ ఎస్సీ, ఎస్టీల పట్ల ఒక ధోరణి అయితే ఇక సామాజిక న్యాయం ఎప్పుడు చేరువవుతుంది? అనే ప్రశ్న ఆయా వర్గాల్లో తలెత్తుతుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇన్చార్జి మంత్రుల్ని నియమించినప్పటికీ వారిని నామమాత్రంచేసి పార్టీ ఇన్ఛాÛర్జిలే పెత్తనం చెలాయిస్తున్నారు. పైగా వీరంతా ముఖ్యమంత్రి సామాజికవర్గం, బంధువర్గం కావడం విశేషం. అఖిలభారతస్థాయి ఉన్నతాధికారులు సైతం ఇన్ఛాÛర్జులకు అడుగులకు మడుగులెత్తుతున్నారనే భావన కింది స్థాయి ఉద్యోగుల్లో సైతం తీవ్రకలకలమే రేపింది. అయినప్పటికీ ఆ పార్టీ శ్రేణులు ఎదురుదాడి చేశాయే తప్ప తమ ప్రవర్తన సరిదిద్దుకోలేదు. ప్రసారమాధ్యమాలతో పాటు న్యాయస్థానాల్ని కూడా లెక్కచేయలేదు. రిజర్వుడు నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీయేతర
వ్యక్తులను ఇన్ఛార్జులుగా నియమించడం కొసమెరుపు. ఎమ్మెల్యేలను పక్కనబెట్టి ఇన్ఛార్జులే పెత్తనం చేయడం రాజ్యాంగస్ఫూర్తికే వ్యతిరేకం. పైగా ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు కూడా అనే విశ్లేషణలు వింటున్నాం. ఇలాంటి సందర్భాల్లో రిజర్వేషన్ల మనుగడ మీద ఆందోళన రేకెత్తుతుంది. ఈ సందర్భంగా మరొక్కసారి రాజ్యాంగ పరిషత్ చర్చలను గుర్తు చేసుకోవలసి వస్తుంది. రాజకీయ రిజర్వేషన్లు పదేళ్లు సరిపోతుందన్న పరిషత్ సభ్యుల నిర్ణయాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంగీకరించవలసివచ్చింది. సామాజిక అభివృద్ధి అంతా పదేళ్లలో జరిగిపోతుందని పరిషత్ సభ్యులు భావించారు. కాని అలా జరగలేదు. చట్టసభల్లో చోటు సంపాదించిన ప్రజాప్రతినిధులు రాజ్యాంగంలో రాసినట్టు సమాజాన్ని మార్చలేకపోయారు. ప్రభుత్వాల వైఫల్యాలు, పార్టీల చేష్టల కారణంగా రిజర్వేషన్లను పదే పదే యధావిధిగా పొడిగించవలసివస్తూవుంది. ఇదే ధోరణి కొనసాగితే అట్టడుగు, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేదెప్పుడు? అందరికీ సమానావకాశాలు దక్కేదెప్పుడు? సమాధానం దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. అందుకే ఈ వర్గాలకు సత్వర న్యాయం చేకూర్చడం కోసం ప్రభుత్వాలు రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని రక్షణలను పగడ్బందీగా అమలు చేయవలసిన అవసరం ఎంతైనా వుంది. అడ్డంకుల్ని కఠినంగా ఎదుర్కోవలసిన గురుతర బాధ్యత కూడా వుంది