ఎం కోటేశ్వరరావు
ఐదు వందల సంవత్సరాల నాటి కల రామాలయ నిర్మాణం జరిగింది, ఇక రామరాజ్యమే తరువాయి అని నరేంద్రమోదీ భక్తులు జనాన్ని నమ్మిం చేందుకు చూస్తున్నారు. కొందరైనా నిజమే అనుకుంటున్నారు. మరోవైపు రామరాజ్యం గురించి నేతలు చెబుతున్నదేమిటి ? దేశంలో జరుగుతున్నదేమిటి ? పదేళ్ల క్రితం నరేంద్రమోదీ అచ్చేదిన్(మంచి రోజులు) గురించి చెప్పారు. ఇప్పుడు కొత్తగా హామీలు, గారంటీలు అనే కొత్త పల్లవి ఎత్తుకున్నారు తప్ప మంచి రోజుల ఊసే లేదు. ఆడిన మాట తప్పని వారసులు కదా ! రాముడి సుగుణాల గురించి చెప్పేవారు తండ్రి మాట జవదాటని ఉత్తముడు అంటారు. ఆ రాముడిని ఆదర్శంగా తీసుకున్నాం అని చెప్పుకొనే నరేంద్రమోదీ అచ్చేదిన్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు, మంచి రోజులు వస్తే వచ్చాయని లేకపోతే ఎంతకాలం పట్టేది చెప్పాలా లేదా ? అసలు రామరాజ్యం అంటే ఏమిటి ? నరేంద్రమోదీ, బీజేపీి గత పది సంవత్సరాలలో ఒక్క హామీ అయినా పాటించారా? గుజరాత్లో గోద్రా రైలు దగ్దం తరువాత జరిగిన మారణకాండ సమయంలో మోదీ రాజధర్మం పాటించాలని ఏకంగా ఏబీ వాజ్పేయి చెప్పాల్సి వచ్చిందంటే తండ్రి మాట ప్రకారం అరణ్యవాసం వెళ్లిన రాముడి ఆదర్శాన్ని ఉల్లంఘించినట్లే కదా, ముఖ్యమంత్రిగా చేయాల్సింది చేయాలన్నారు తప్ప గద్దె దిగాలని వాజ్పేయి చెప్పలేదు. వాల్మీకి రామాయణం ప్రకారం రాముడి పాలనలో ఏ మహిళా వితంతువు కాలేదు, క్రూరమృగాల నుంచి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. రోగాల గురించి భయం లేదు. ప్రపంచానికి బందిపోట్ల బెడదతప్పింది. తాము పనికిరాని వారమని ఎవరూ భావించలేదు. యువకులకు ముసలివారు కర్మకాండలు చేయలేదు. అందరూ సంతోషపడ్డారు. సకల జనులూ ధర్మం మీద కేంద్రీకరించారు. అందరూ ఒక ఆదర్శ పురుషుడిగా రాముడి వైపే చూశారు. ఒకరిని ఒకరు చంపుకోలేదు. అంతర్జాలంలో ఉన్న సమాచారం ప్రకారం (వాల్మీకి రామాయణం, యుద్ధకాండ, సర్గ 128, 95 నుంచి 106 శ్లోకాలు) రాముడి పాలనలో జనాలు అవాస్తవాలు చెప్పకుండా ధర్మం మీదనే కేంద్రీకరించారు. అందరూ అద్భుతమైన వ్యక్తిత్వ లక్షణాలను కలిగి ఉన్నారు. అందరూ ధర్మానికి కట్టుబడి ఉన్నారు. ఆ విధంగా రాముడు వేలాది సంవత్సరాలు రామరాజ్యాన్ని ఏలాడు. అబ్బే ఇప్పుడు చెబుతున్నది అసలైన సనాతన ధర్మం కాదు అని చెప్పేవారు కొందరు. వర్తమాన భాష్యాలతో ఉన్న మనుస్మృతిని రాముడు అసలు పాటించలేదు. రాజగురువు, ప్రధాన సలహాదారైన బ్రహ్మర్షి విశ్వామిత్ర మార్గదర్శనంలో వశిష్ట ధర్మ సూత్రాలను పాటించాడు అని చెప్పేవారు కొందరు. ఇప్పుడు ఏది ఉనికిలో ఉందో, దాని సంగతి ఏమిటో, వేల సంవత్సరాలుగా అది కలిగించిన దుష్టప్రభావానికి కారణం ఏమిటో మాత్రం చెప్పరు. సనాతన ధర్మాన్ని పాటించాలి, పరిరక్షించాలి అంటున్నారు. దీని అర్ధం రాజ్యాంగాన్ని ఆ విధంగా తిరగరాయమనా ? ఇక నిత్యం రామభజన చేస్తున్నవారు, రామరాజ్యం గురించి చెబుతున్న వారేమంటున్నారు.2024 జనవరి 16వ తేదీ పత్రికల్లో వచ్చిన ఒక వార్త శీర్షిక ఇలా ఉంది.‘‘ రామరాజ్య నియమాలనే ప్రభుత్వం అనుసరిస్తున్నది, ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు చేస్తున్నది : ప్రధాని మోదీ’’. ఆయోధ్యలో రామాలయ ప్రతిష్ట కార్యక్రమానికి ముందు పదకొండు రోజుల అనుష్ఠానంతో దేశంలో వివిధ గుళ్లు గోపురాలను సందర్శించిన సందర్భంగా నరేంద్రమోదీ రామచరిత మానసతతో సహా అనేక హిందూ పురాణాలను ఉటంకిస్తూ చెప్పిన మాటలకు పెట్టిన పేరది. నిష్టలో ఉన్న మోదీ వాస్తవాలను చెప్పారా, మరొకటా ? గడచిన తొమ్మిది సంవత్సరాలలో పాతిక కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటపడవేసినట్లు, పది కోట్ల మంది నకిలీ లబ్దిదారులను ఏరివేసినట్లు కూడా చెప్పారు.(ఇంత ప్రగతి సాధించి రామరాజ్యాన్ని నెలకొల్పితే ఎనభై కోట్ల మందికి మరో ఐదు సంవత్సరాల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నట్లు ఎందుకు ప్రకటించినట్లు ? దారిద్య్రం నుంచి బయటపడినా నెలకు ఐదు కిలోల ధాన్యం కూడా కొనుగోలు చేయలేని దుస్థితిలో జనం ఉన్నారని అర్ధమా ? రామరాజ్యంలో ఇలాగే ఉందా ? )
అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్ మరొక అడుగు ముందుకువేసి బీజేపీి జాతీయ సమావేశంలో మాట్లాడుతూ రామరాజ్య భావనను ప్రధాని మోదీ ఎంతో సమర్దవంతంగా అమలు జరిపినట్లు, రామరాజ్యం సిద్ధించినట్లు ఆకాశానికి ఎత్తారు. దానికి ‘వికసిత భారత్’ అని ముద్దుపేరు పెట్టారు. రాముడు పదమూడు సంవత్సరాలు అరణ్యవాసం గడిపినట్లు రామాయణం చెబితే యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఐదు వందల సంవత్సరాల తరువాత రాముడు ఆయోధ్యకు వచ్చాడని చెప్పారు. వికసిత భారత్ తీర్మానంలో పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీలో మహిళలపై జరిగిన దారుణాలను ఖండిస్తూ ఒక మహిళ పాలనలో ఇలా జరగటం సిగ్గుచేటని బీజేపీి పేర్కొన్నది. నిజమే, కానీ బీజేపీిి రామరాజ్య పాలనలో మణిపూర్లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించటం మర్యాదా, సిగ్గుచేటా ? కనీసం అలాంటి ఉదంతం జరగటం విచారకరం అని కూడా ప్రకటించని మర్యాద పురుషోత్తములు. బీజేపీి ఎంపీ బ్రిజ్భూషణ్ మహిళా రెజ్లర్స్ను లైంగికంగా వేధించిన సంఘటనలు దేశంలో కలిగించిన సంచలనం తెలిసిందే. ఇక గుజరాత్ బిల్కిస్ బానూ ఉదంతం తెలిసిందే. ఆమె మీద జరిగిన సామూహిక అత్యాచారం కేసులో యావజ్జీవ శిక్షలు పడిన వారు సత్ ప్రవర్తన కలిగిన బ్రాహ్మణులని కితాబునిస్తూ శిక్ష పూర్తిగాక ముందే విడుదల చేసి సన్మానాలు చేసిన రామభక్తులను దేశం మరచిపోగలదా ! సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని రద్దు చేసి తిరిగి వారిని జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ఇవన్నీ అపర శ్రీరాముడి ఏలుబడిలో జరిగినవే సుమా ? ఒక్కో ఉదంతం పట్ల ఒక్కో వైఖరి, శ్రీ రామరాజ్యంలో ఇలాగే జరిగిందా?
సీనియర్ జర్నలిస్టు