చింతపట్ల సుదర్శన్
అరుగుమీద ఓ మూల ముందుకాళ్ల మధ్య తల ఇరికించుకుని కూచుంది డాగీ. అరుగుమీద తన జాగాలో తను కూచుంటూ చూసింది డాంకీ. అయిదు నిమిషాలయినా ఎలాంటి కదలికాలేదు డాగీలో. ఏమ యింది దీనికి మొన్నేమో తోక చుట్టూ తిరుగుతూ ఉషారుగా ఉండిరది అనుకుంటూ ఏవిటి తంబీ ఉలుకూ పలుకూ లేకుండా తోకని వెనక కాళ్లమధ్యనా, తలని ముందు కాళ్లమధ్యనా ఇరికించి తపస్సు చేస్తున్నావు అంది డాంకీ … తపస్సు చెయ్యడానికి పీఠాధిపతినా, స్వామిజీనా స్ట్రీట్ డాగ్ని అంది డాగీ తలెత్తకుండానే. మరి ఆ ‘ధర్నా’ ఫోజేమిటో ఇది ఫోజేం కాదు ఈ వేళ నామనసేం బాగో లేదు అంది. మనస్సా అదేమిటోయ్ మనకు మనస్సేమిటి నాలుక్కాళ్ల జంతువులం కదా, ఉండ వలసిన మనుషులకే మనసనేదొకటి ఉండటం లేదు అంది డాంకీ. ఎందుకుండదు ఉన్నదాన్ని పైకి కనిపించకుండా తొక్కుతున్నారు. నాకు మాత్రం మనస్సనేది ఉందనిపిస్తున్నది. తల్చుకుంటే దుఃఖం పొంగి పొరలి వస్తున్నది అంది డాగీ. దుఃఖమా? కొత్త మాట ఎవరన్నా బాదితే బాధ పడతాం. అది శరీరానికి సంబంధించింది. ఈ దు:ఖం మనస్సుకు సంబంధించింది . అసలింతకీ దుఃఖ కారణమేంటో. డాగీ తల పైకెత్తింది. దాని కళ్లల్లో నీళ్లు కనపడ్తున్నాయి. ఇవ్వాళ వీధిలో నడిచి వస్తుంటే రోడ్డు పక్కన చెత్తకుండీ దగ్గర ఓ కుక్క ఇంకా కళ్లు తెరవని కూనలతో కని పించింది అంది డాగీ విచారంగా, ఇందులో కొత్తేముంది. కుక్కలు చెత్త కుండీల దగ్గర పిల్లల్ని కనడం, మనుషులు తాము కన్న బిడ్డల్ని చెత్తకుండీలో పడేసిపోవడం మామూలే కద. మనుషుల సంగతి చెప్పకు చిరాకేస్తుంది. ఆ తల్లీ పిల్లల్ని చూశాక మా అమ్మ గుర్తుకు వచ్చింది. ఎక్కడుందో ఏమో తమ్మళ్లు, అన్నా, చెల్లి ఉండాలి, అంతా ఎక్కడున్నారో అసలున్నారో లేదో అని ఆలోచిస్తుంటే ఏడుపు ఆగడం లేదు అంది డాగీ. అదా సంగతి ఈ అక్కా చెల్లీ అన్నా, బాబాయి లింకులన్నీ మనుషులకే కాని మనకు ఎక్కడివి. మనుషులు ఈ బంధాలను అడ్డంపెట్టుకుని జీవితాంతం తల్లిదండ్రుల్ని కష్ట పెట్టవచ్చు. కుటుంబ సంబంధాలను అడ్డం పెట్టుకుని అరాచకాలు చేయవచ్చు. మన కులం కాదు గదా. రెక్కలు వచ్చీరాగానే ఎవరిదారి వాళ్లు చూసుకుంటారు. ఆస్తులూ ఉండవు, పంచుకోటాలు, ‘పగ’లు పెంచుకోవడాలూ ఉండవు. భవబంధాల కారణంగానే కదా మనుషులు తరతరాలకు సరిపడ ఆస్తులు పెంచుకుంటారు, వంశపారంపర్యంగా పదవులు పంచుకుంటారు. పదవులకోసం ఒకళ్లకొకళ్లు శత్రువులై పోతారు అంది డాంకీ. అప్పుడే అరుగు ఎక్కుతున్న అబ్బాయి శత్రువులంటున్నావు డాంకీ. ఎవరి కెవరు శత్రువులు, ఎవరికెవారు మిత్రువులు అన్నాడు నవ్వుతూ అరుగు చివర కూచుంటూ. ఇంకెవరి గురించోకాదు. మనుషుల గురించే చెప్తున్నా. వాళ్లు ఒకళ్లకొకళ్లు శత్రువులు అవుతారు అంటున్నా. బవబంధాలనేవి ‘మా జంతువుల్ల్లో’ లేదంటున్నా అంది డాంకీ. నిజమే నువ్వన్నది. భవ బంధాలూ, రాజకీయాలూ మనుషులకే కద ఉండేది. పదవి ఉన్నంత కాలమే ఎవరికైనా పార్టీలో అనుబంధం అది కాస్తా పోయిందా శత్రుత్వం, మరో పార్టీలో మరో ‘అనుబంధ సంబంధ బంధం’ అన్నాడు అబ్బాయి. ఏ ‘టాపిక్క’యినా రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండదు కదా. దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, ‘వాట్సప్పు’ రాజకీయాలు, మనుషుల బతుకంతా రాజకీయమే. ఆఖరుకు అన్నాచెల్లెళ్ళు సంబంధం కూడా అంతే మరి అంది డాగీ. అవును మరి అదేకదా నేన నేది నువ్వనవసరంగా శోకసముద్రంలో మునకెయ్యకు. అలాంటి లింకులు లేనందుకు నీ మార్గాన నువ్వు బతికేస్తున్నందుకు హ్యాపీగా ఉండు అంది దాంకీ. అన్న చెల్లెళ్ల అనుబంధం ఇప్పుడు మన రెండు రాష్ట్రాల్లో ‘బర్నింగ్ టాపిక్’’ అన్న మాట. ‘రక్తసంబంధం’ అన్న సినిమా గతంలో ఓ డూపర్ హిట్టు. ‘ఓ అన్నా నీ అను రాగం’ అన్న సినిమా పాట సూపర్ హిట్టు. కానీ ఇప్పుడది ఓ పాత చింతకాయ పచ్చడి. తండ్రీ కొడుకు, అన్నా తమ్ముడు, అన్నా చెల్లి, బాబాయి అన్న కొడుకు ఇవన్నీ పాలిటిక్సులో పనికేరావు అన్నాడబ్బాయి. అవునవును ఒక చెల్లి ఓ అన్నకు అపోజిషన్ పార్టీ అయిందని విన్నాను అంది డాంకీ. రాజకీయానికీ, రక్తసంబంధానికి బద్ధశతృత్వం మరి. రాజులకాలం నుంచీ ఉన్నదే ఇది. అన్న పంపితే వచ్చిందో, తనకు బుద్ధి పుటే ్టవచ్చిందో బాణంలా వచ్చిందో బుల్లెట్టయి వచ్చిందోకాని ఓ సోదరి ఒక రాష్ట్ర అధినేతను ఓడిరచానని చెప్తున్నది అన్నది డాగీ. అక్కడితో ఆగలేదు కథ. మరొక మనిషిని దేశాధినేతనుచేసి తీరుతానంటున్నది. తన తండ్రి ఆ ‘కల’ తనదని తనకు ‘కలలో’ కనిపించి చెప్పాడంటున్నది. అండమాన్ దీవులకైనా పోతానంటున్నది అంది డాంకీ. ఇదంతా నిజమేనా రాజకీయాల్లో అనుబంధాలనేవే ఉండవా అంది డాగీ. నువ్వు మళ్లీ మీ అమ్మనీ, సోదర సోదరీమణుల్ని గుర్తు చేసుకుని భోరున ఏడవకు. మనుషులే బవబంధాలను తుంగలో తొక్కుతుంటే అంది డాంకీ. అసలు ఏది రాజకీయమో, ఏది టీవీ సీరియలో, ఏది స్టేజి డ్రామానో ఎవరు చెప్పలేరు. బాణం ఎవరేస్తారో, ఏ వైపు వేసిన బాణం ఏ వైపుకు దూసుకెళ్తుందో చెప్పనూలేరు. సనాతన ధర్మము, ‘అగమ్య గోచర రాజకీయము’ మన దేశపు వారసత్వ సంపద అంటూ అరుగుదిగాడు అబ్చాయి. అవతలి వాడి మీదకు వేసిన బాణం, వేసిన వాడికే గుచ్చుకోవచ్చు. ఒకడి కోసం వేసిన బాణం మరొకడి డొక్క లో గుచ్చుకోవచ్చు. ఏ బాణం ఎటు పోవునో ఎవరికెరుక అంది డాంకీ కళ్లు మూసుకుంటూ. ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక’ అంటూ తను వీధిలో చూసిన దృశాన్ని గుర్తు చేసుకోసాగింది డాగీ.