జనాదరణతో పాటు ఎన్నికలలో పోటీచేసి నెగ్గడానికి కావలసిన సాధన సంపత్తి కూడా ఈ రోజుల్లో అవసరమే. ఈ నాటి రాజకీయాలకు అతికినట్టు సరిపోయే వ్యక్తి దొడ్డలహల్లి కెంపెగౌడ శివకుమార్. ఆయన డి.కె.శివకుమార్ గా ప్రసిద్ధుడు.శివకుమార్ అత్యంత సంపన్నుడైన రాజకీయ నాయకుడంటారు. ఆయన సంపత్తి విలువ 842 కోట్ల రూపాయలు ఉంటుందంటారు. ఆయన కర్నాటకకు పరిమితమైన వాడిగా కనిపించునప్పటికీ కాంగ్రెస్ రాజకీయాలలో అంతకన్నా చాలా పెద్ద పాత్రే పోషిస్తున్నారు. కాంగ్రెస్ కు ఎక్కడ అవసరం వచ్చినా ఆయనే ప్రత్యక్షమవుతున్నారు. రెండు దశాబ్దాలకు పై నుంచి కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలను చక్కబెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ అనుసంధాన పాత్ర కేవలం కర్నాటకకు పరిమితమైంది కాదు. 2002లోనే విలాస్రావ్ దేశ్ముఖ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవిశ్వాస తీర్మానం ఎదురైంది. అప్పుడూ దేశ్ముఖ్ ను గట్టెక్కించింది శివకుమారే. 2017లో గుజరాత్ నుంచి రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పుడు 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులోని తన రిసార్ట్ కు తీసుకొచ్చి సకల సదుపాయాలు కల్పించి ఒక్క కప్ప కూడా చేజారకుండా చూసుకున్నారు. దీనివల్లే అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నిక కాగలిగారు. అహ్మద్ పటేల్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యసభకు ఎన్నిక కాకుండా చూసే బాధ్యత మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అప్పగించారు. షా ఎత్తులన్నింటినీ శివకుమార్ చిత్తుచేసి పటేల్ ను గెలిపించారు. ఆక్కడి నుంచే శివకుమార్ మీద అమిత్ షా తన చేతిలో ఉన్న సీబీఐ, ఇ.డి., ఆదాయపు పన్ను శాఖలాంటి అస్త్రాలన్నింటినీ వినియోగించారు. శివకుమార్ జైలుకెళ్లేట్టు చేశారు. చివరకు భంగ పడిరది అమిత్ షానే. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ గుప్పెట్లో ఉంచుకున్న మోదీ, షా ద్వయం ఆటలు కట్టడి చేయిస్తున్న నాయకుడు శివకుమార్ ఒక్కడేనేమో! నిరాయుధంగానే ఆయన షాను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. 2018 కర్నాటక శాసనసభ ఎన్నికల తరవాత కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడంలో ప్రధాన పాత్ర శివకుమార్ దే నంటారు.
గత వారం హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడకు ప్రమాదం ముంచుకొస్తే సుకు నాయకత్వంలోని ప్రభుత్వానికి ఊతకర్రలందించింది శివకుమారే. మూడువేల కిలోమీటర్ల దూరాన ఉన్న శివకుమార్ హుటాహుటిన హిమాచల్ ప్రదేశ్ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడారు. అయితే ఆయన అక్కడకు చేరుకునేటప్పటికే అంగడి సరుకుగా మారిన ఆరుగురు కాంగ్రెస్ శాసనసభ్యులు కంచె దాటి బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసి ప్రసిద్ధ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఎన్నిక కాకుండా చేశారు. ఇదే అదునుగా సుకు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ సంసిద్ధమైంది. ఈ లోగా శివకుమార్ చేరుకుని ఆ ఆరుగురు శాసనసభ్యుల్ని అనర్హులుగా ప్రకటించేట్టు చేసి ప్రభుత్వానికి ఊపిరి పోశారు. ఆపరేషన్ లోటస్ పేర చట్టసభల సభ్యులను అంగడిసరుకుగా మార్చడంలో బీజేపీది అందె వేసిన చేయికనక శివకుమార్ తీర్చిన తగవు ఎన్నాళ్లు నిలబడుతుందో తెలియదు. హిమాచల్ ప్రదేశ్లో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానవర్గం భూపేశ్ భగేల్, భూపిందర్ హూడాను కూడా శివకుమార్ తో పాటు పరిశీలకులుగా పంపించింది. కానీ ఈ హడావుడి అంతా శివకుమార్ దే. నిరాయుధంగా అమిత్ షా ఆటకట్టిస్తున్నది ఆయన మాత్రమే.
మొదట విద్యార్థి నాయకుడిగా ఉన్న శివకుమార్ 1989లో మైసూరు జిల్లాలోని సతనూర్ నియోజక వర్గం నుంచి మొదటిసారి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. అక్కడి నుంచి ఆయన ఎన్నడూ వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరమే రాలేదు. తరవాత కనకపురా నియోజకవర్గం నుంచు ఎన్నికవుతూ వస్తున్నారు. ప్రస్తుతం శివకుమార్ కర్నాటక ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. గత ఏడాది మే లో కర్నాటక శాసనసభ ఎన్నికలు జరిగిన సమయంలో శివకుమార్ పి.సి.సి. అధ్యక్షుడిగా ఉన్నారు. కర్నాటక రాజకీయాలలో లింగాయత్, ఒక్కలిగ బలమైన సామాజిక వర్గాలు. శివకుమార్ ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారు. శివకుమార్ కు ఇద్దరు కూతుళ్లు. ఒక కుమారుడు. పెద్ద కూతురు కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్ధార్థ్ కుమారుడు అమర్త్యను పెళ్లాడారు. ఆయన అన్న డి.కె.సురేశ్ కూడా రాజకీయ నాయకుడే. బీజేపీకి సర్వాధిపతి నరేంద్ర మోదీయే అయినా సకల వ్యవహారాలను చక్కబెట్టేది కేంద్ర హోం మంత్రి అమిత్ షానే. ఎన్నికల ప్రచారంలో మోదీ ఉద్దండుడు అయి ఉండొచ్చుకానీ ఎక్కడ ఎలాంటి సామాజిక సమీకరణలు ఫలిస్తాయో కచ్చితంగా అంచనా వేయగలిగింది మాత్రం అమితా షానే. కాంగ్రెస్లో అదే పాత్ర పోషించే స్థితికి డి.కె.శివకుమార్ చేరుకున్నారు.
ప్రతిపక్షాల ఐక్యతకు మునుము పట్టిన నితీశ్ కుమార్ మధ్యలోనే కాడి కింద పడేసి ప్రత్యర్థి పక్షంలో చేరిపోయారు. ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి ఇండియా కూటమికి ఒక సమర్థుడైన నాయకుడు కావాలి. ఆ స్థానాన్ని భర్తీ చేసే స్తోమత శివకుమార్ కు ఉంది. ఇప్పటి వరకు ఆయనకు అధిష్ఠానం ఏ పని అప్పగించినా విఫలం కాలేదు. కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో తిష్ఠ వేసి నిష్క్రియాపరులుగా మిగిలిపోతున్న కె.సి.వేణుగోపాల్ కన్నా శివకుమార్ చేస్తున్న పనే ఎక్కువ. ఆయనలో కార్య సాధకుడి లక్షణాలున్నాయి. హిందీ రాకపోవడమే ఆయన జాతీయ రాజకీయాలలో రాణించడానికి ఆటంకంగా మారితే తప్ప ఆయనకు సకల సామర్థ్యాలూ ఉన్నాయి.
-అనన్యవర్మ