కె.వి.వి. ప్రసాద్
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రైతాంగాన్ని శత్రువులుగా చూస్తూ వీరిని వ్యవసాయం నుండి రైతులను దూరంచేసే విధానాలు రూపొందిస్తున్నది. కేంద్రం 2020లో తెచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలు ఇందుకు ఉదాహరణ. దేశంలో ఉన్న 14.58 కోట్ల రైతు కుటుంబాల వద్ద 38.82 కోట్ల ఎకరాల సాగుభూమి ఉన్నది. 5 ఎకరాలలోపు సాగు భూమి ఉన్న కుటుంబాలు 12.57 కోట్లు. వీరి వద్ద ఉన్న భూమి 18.38 కోట్ల ఎకరాలు మాత్రమే. ఏ మాత్రం భూమిలేని గ్రామీణ కుటుంబాలు 7 కోట్లకు పైగా ఉన్నారు. వీరిలో అత్యధికులు దళితులు, గిరిజనులు, మైనారిటీలే. సాగు భూమిలేని కొద్ది గొప్ప భూమి ఉండి వ్యవసాయంపై ఆధారపడినవారు కౌలు రైతులుగా జీవనం సాగిస్తున్నారు. మనదేశ ఆర్థిక, సామాజిక నిర్మాణంలో వ్యవసాయం పునాదివంటిది. దేశ జనాభాలో అత్యదికశాతం ప్రజల జీవన విధానం వ్యవసాయం. కానీ ప్రభుత్వాలు వ్యవసాయంపట్ల, వ్యవసాయ అనుబంధ రంగాల పట్ల, గ్రామీణ ప్రజల పట్ల పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఫలితంగా వ్యవసాయంపై ఆధారపడిన కోట్లాది కుటుంబాలు అప్పుల భారాన్ని మోస్తున్నాయి. దశాబ్దాలుగా పేదరికంలో మగ్గుతూనే ఉన్నాయి. రైతులు, కౌలు రైతులు, గ్రామీణ పేదలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. ప్రపంచ జనాభాలో మన దేశ జనాభా 17%. భూమిలో కేవలం 2.4% మాత్రమే. దేశ జనాభాలో ఇప్పటికీ 48.6% మంది ప్రజలు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న శ్రమశక్తిని వినియోగించుకోవాల్సిన బాధ్యతను పాలకులు విస్మరిస్తున్నారు. వ్యవసాయానికి తగిన ప్రాధాన్యతనిస్తూనే అనుబంధ రంగాలను ప్రోత్సహించాలి. అనుబంధ పరిశ్రమల ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించాలి. తద్వారా గ్రామీణ నిరుద్యోగాన్ని రూపుమాపగలుగుతాం. పట్టణాలకు వలసలు ఆగుతాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. దేశ జనాభాకు అవసరమైన ఆహారంతోపాటు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. పారిశ్రామిక వృద్ధికి కూడా ముందంజ పడుతుంది. రైతులతోపాటు వ్యవసాయ కార్మికులు, చేతివృత్తులవారి జీవన పరిస్థితులు మెరుగుపడతాయి.
స్వాతంత్రానంతరం వ్యవసాయాభివృద్ధి ప్రాధాన్యతను గుర్తించిన నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రు అన్ని పనులు ఆగినా, వ్యవసాయం మాత్రం కాదు. అని గట్టిగా వక్కాణించారు. మరో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి రైతులను జైజవాన్గా కీర్తిస్తూ వ్యవసాయంపట్ల మక్కువ చూపెట్టారు. వ్యవసాయాభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించారు. స్వాతంత్రం పొందిన తొలినాళ్ళలో 50 మిలియన్ టన్నుల ఆహార ఉత్పత్తులందించిన మన వ్యవసాయరంగం నేడు సుమారు 300 మిలియన్ టన్నులు పండిరచే స్థాయికి చేరింది. అయితే ఇప్పటికీ నూనె ఉత్పత్తులు, సుగంధద్రవ్యాలు దిగుమతి చేసుకునే దశలోనే మనం ఉన్నాము. ఉత్పత్తి పెరిగిందని సంతోషపడాలో ఉత్పత్తిదారులైన రైతులు నేడు అప్పుల భారంతో సతమతమవుతూ ఆత్మహత్య లకు పాల్పడటం చూస్తూ వేదన చెందాలో ఆర్థంకాని దుస్థితి నెలకొన్నది. 1990 ప్రాంతంనుండి దేశంలో అనుసరిస్తున్న పాలక విధానాలు రైతుల నడ్డి విరుస్తున్నాయి. ప్రపంచీకరణ నేపధ్యంలో ఆర్థిక సంస్కరణలు మన వ్యవసాయరంగాన్ని దిగజార్చటం మొదలుపెట్టాయి. 1990 దశకం వరకు వ్యవసాయ ఉత్పత్తుల వార్షిక పెరుగుదల 3.69% ఉన్నది. 19952000 కాలంలో వాటి పెరుగుదల 2.35% పడిపోయింది. 2010
2020 మధ్యకాలంలో 1.65% దిగజారిపోయింది. వ్యవసాయ వాణిజ్యం 1.63% నుండి 0.95`0.82% దిగజారింది. ప్రధాన పంటలైన వరి, గోధుమ, మొక్కజొన్న తదితర ఉత్పాదకతలు తగ్గుతూ వచ్చాయి. సాగు ఖర్చులు పెరిగిపోయి గిట్టుబాటు కాని దశకు చేరుకున్నాయి. విత్తనాలు, పురుగు మందులు, సాగుఖర్చులు విపరీతంగా పెరిగాయి. 2000 తరువాత ఆది 28%, 2020 తరువాత 36% కి సాగు ఖర్చులు పెరిగాయి. ముఖ్యంగా బహుళజాతి సంస్థల ద్వారా తయారవుతున్న జీవసాంకేతిక విత్తనాల ప్రవేశంతో ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఎరువులు, పురుగుమందుల భారాలు విపరీతంగా పెరిగి రైతులు మరింత భారం మోయాల్సివచ్చింది. రైతు రైతుగా కాక తన భూమిలోనే కూలీగా మారవలసిన దుర్బర పరిస్థితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. అనేక ఉత్పత్తులపై వాస్తవంగా వారికి దక్కవలసిన ధరలు దక్కకపోగా వినియోగదారులపైన పెనుభారం మోపుతూ మధ్యదళారులు, వ్యాపారులు అధిక లాభాలు పొందుతున్నారు. వీరికితోడు రిలయన్స్, వాల్మార్ట్, అదానీ,మెట్రో, మోర్ లాంటి బడా కార్పోరేట్ సంస్థలు ఈ దోపిడీని మరింత తారాస్థాయికి తీసుకువెళ్ళనున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ 140 కోట్ల ప్రజానీకానికి ఆహారభద్రతను సమకూరుస్తూ పారిశ్రామికరంగానికి అవసరమైన వాణిజ్య పంటలతోపాటు ఆహార ఉత్పత్తులను అందిస్తున్న మన రైతాంగానికి సామాజిక న్యాయం దక్కడంలేదు. ప్రపంచ ఆగ్రరాజ్యం అమోరికాలో సంవత్సర సగటు ఆదాయం 72,267 ఉండగా వ్యవసాయ కుటుంబ వార్షిక ఆదాయం 1 లక్ష 20 వేలు అనగా 51% అధికంగా ఉన్నది. భారత్లో రైతు ఆదాయం 2.5 రెట్లు తక్కువగా ఉండటం మన రైతులు చేసుకున్న దౌర్బాగ్యం. టాటా ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) ఆధ్యయనంలో 1996 నుండి 2008 వరకు కేంద్రం వివిధ పంటలకు నిర్ణయించిన కనీస మద్దతు ధరలు సాగుఖర్చు కన్నా 38% తక్కువగా ఉన్నాయని స్పష్టంగా తెలిపింది. ఏటేటా ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడం మద్ధతు ధరలు లభించకపోవడం, పంట నష్టాలు, అధిక వడ్డీలకు రుణాలు, సరైన పంటల బీమా లేక పోవడం తదితర కారణాలతో గత 2 దశాబ్దాల కాలంలో సుమారు 4 లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయం గిట్టుబాటుకాక రోజుకు సగటున 2,400 మంది రైతులు వ్యవసాయాన్ని వదిలివేసి వేరే వృత్తులలోకి వేళ్ళిపోతుండటం మన వ్యవసాయరంగంపట్ల పాలకుల శ్రద్ధకు అద్దం పడుతుంది. గత 35 సంవత్సరాలలో వ్యవసాయపంటల ధరలు 22 రెట్లు పెరగగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల కనీస వేతనాలు 92 రేట్ల నుండి 150 రేట్లు పెరిగాయి. 7వ పే కమీషన్ సిఫార్సుల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ అతితక్కువస్థాయి ఉద్యోగి కనీస వేతనం నెలకు రూ.18 వేలుగా నిర్ణయించింది. అదే సమయంలో రైతుల ఆదాయం సంగతి పాలకులకు పట్టడంలేదు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికే రెట్టింపు చేస్తామన్న నరేంద్రమోదీ ప్రభుత్వ హామీ ఈనాటికి అమలు జరగలేదు. ఈ పరిస్థితుల్లో సంక్షోభ దశలో ఉన్న ఆకలి బాధలను, పౌష్టికాహాం లోపాన్ని, దారిద్రాన్ని, సహజవనరుల పతనాన్ని, పర్యావరణ విధ్వంసాన్ని, నిరుద్యోగాన్ని, ఉగ్రవాద ఒరవడిని నియంత్రించగలిగేది ఒక్క వ్యవసాయరంగ అభివృద్ధి మాత్రమే అన్న సత్యాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం గమనించాలి. వ్యవసాయ పురోభివృద్ధికి అవసరమైన విధానాలు రూపొందించాలి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తిరిగి 3వసారి గద్దెనెక్కాలనే మోదీ ప్రభుత్వం రైతాంగ డిమాండ్లను ఆమోదించకుంటే వారి ఆగ్రహజ్వాలకు గురికాక తప్పుడు. రైతాంగం తాజాగా చేస్తున్న ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకోవాలి. లేకపోతే మోదీ కలలు కల్లలవుతాయి.
ఏపీ రైతుసంఘం ప్రధాన కార్యదర్శి
సెల్: 9390736374