వి. శంకరయ్య
2019 ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును, మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్కు గాని ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ముప్పతిప్పలు పెడుతున్నన్ని సమస్యలు వారికి ఎదురై వుండలేదు. జగన్మోహన్ రెడ్డికి ఇంటా బయట అన్నీ సమస్యలే! రాజకీయంగా అన్నీ ఎదురు దెబ్బలే. తమను మోసం చేశారనే భావన ప్రధానంగా ప్రభుత్వోద్యోగుల్లో బలంగా ఉంది. ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు మౌనం పాటించడానికి తోడు నిరసన తెలిపేందుకు ప్రభుత్వం కఠిన వైఖరి అడ్డు రావడంతో ఈ అసంతృప్తి చాప కింద నీరులాగా వ్యాపించి ఉంది. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు, ప్రభుత్వం కలగలసి వ్యవహరించిన తీరుతో కొత్త డిమాండ్లు గాలికి పోగా ఒకటవ తేదీ జీతం పడితే చాలానే స్థితికి ఉద్యోగులను తెచ్చారు. అయితే ఉపాధ్యాయ సంఘాలు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ ప్రభావం గతంలో ఏ ప్రభుత్వమూ ఎదుర్కోని సంకట స్థితికి చేరింది. అయినా వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ సిబ్బంది ప్రస్తుతం రోడెక్కి వున్నారు. ప్రధానంగా అంగన్వాడీ మహిళలు గురువారానికి 25 రోజులుగా సమ్మె చేయడమే కాకుండా వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల కాలంలో అమరావతి మహిళల పోరాటం చరిత్ర సృష్టించినది. తాజాగా అంగన్వాడీ మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బెదిరింపులు, ఉద్యోగాల నుంచి తొలగింపు ఆదేశాలు లెక్కచేయకుండా నిరవధికంగా సమ్మె కొనసాగిస్తున్నారు. అగ్నికి వాయువు తోడైనట్లు ప్రజాజీవితంలో ఎంతో కీలకమైన మున్సిపల్ పారిశుధ్య కార్మికులు సమ్మె బాట పట్టి ప్రభుత్వానికి గుక్క తిప్పుకోలేని స్థితి కల్పించారు. వీరికి తోడు సర్వశిక్ష అభియాన్కు చెందిన బోధన, బోధనేతర సిబ్బంది సమ్మెలో వున్నారు. మెగా డిఎస్సీ కోసం నిరుద్యోగులైన వేలాది మంది యువకులు రోడెక్కారు. రాష్ట్రం మొత్తంగా ఎన్నడూ లేని విధంగా సమ్మెలతో ధ్వనిస్తోంది. ఇదిలా వుండగా 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు లభించిన అధికారాలను ముఖ్యంగా పంచాయతీలను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను దారి మళ్లించారు. నాలుగన్నరేళ్లు ఓపిక పట్టిన సర్పంచ్లు ఎన్నికల సమయంలో సమర శంఖం పూరించారు. ఈ పోరాటంలో ప్రత్యేకత ఏమంటే వైసీపీకి చెందిన వారు వున్నారు. రేపు ఎన్నికల్లో వీరు చేసే అవకాశం చాప కింద నీరులా వుండబోతోంది. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల అమలులో భాగస్వామ్య లేకుండా పోవడంతో సర్పంచ్లు కుతకుత లాడిపోతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తెతే రాజకీయంగా సమస్యల సుడిగుండంలో జగన్మోహన్ రెడ్డి చిక్కుకున్నారు. అమరావతి రాజధాని సమస్య రెండిరటికి చెడిన రేవడిని చేసింది. రాజధాని కేసు సుప్రీంకోర్టులో ఏప్రిల్కు వాయిదా పడిరది. రాజధాని ఉత్తరాంధ్రకు తరలించనున్నట్లు ప్రకటించి ఆ ప్రాంతంలో అదనంగా ఏమీ లబ్ధిపొంద లేదు. సంవత్సరాలు గడచి పోతున్నా రాజధాని కాదు కదా క్యాంపు కార్యాలయాలు తరలించ లేకున్నారు. ఉత్తరాంధ్రలో ప్రజల మన్నన పొంది వుంటే ఆ ప్రాంత ముఖ్యమైన వైసీపీి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేవారు కాదు. ఇప్పటికే చాల మంది గోడ దూకేశారు. ఇంకెంత మంది వెళతారో తెలియని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో కోస్తా ప్రాంతంలో తీవ్రమైన గండి పడనుంది. ఈ అసంతృప్తిని ఎమ్మెల్యేల మీద నెట్టి, కొత్త వారిని తెర పైకి తెచ్చి గండం గట్టెక్కాలనే వ్యూహం బెడిసి కొడుతోంది. ఈ వ్యూహం అమలు అసలుకే మోసం తెచ్చి అనేక మంది పార్టీ ఫిరాయించే పరిస్థితి ఏర్పడిరది. 2019 ఎన్నికల్లో రాయలసీమ నాలుగు జిల్లాల్లో 51 శాసన సభ స్థానాలుంటే 49 మంది వైసీపీి ఎమ్మెల్యేలు గెలిపొందారు. రాబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున నష్ట పోవలసి వస్తోంది. 1953 లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినపుడు కర్నూలు రాజధానిగా వుండేదనీ ప్రస్తుతం అదే రాష్ట్రం ఏర్పడిరది కాబట్టి ఇప్పుడు కూడా కర్నూలును రాజధాని చేయాలని శ్రీ బాగ్ ఒడంబడిక మేరకు రాజధాని గాని కనీసం హైకోర్టు గాని తమకు ఇవ్వాలని సీమ వాసులు డిమాండ్ చేస్తుంటే న్యాయ రాజధాని ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రచారంచేసి హైకోర్టు భావోద్వేగం సృష్టించారు. ఆచరణలో ఏమైందీ ప్రత్యేకంగా చెప్పే పని లేదు. తుదకు కృష్ణ యాజమాన్య బోర్డు కార్యాలయం కూడా కర్నూలులో పెట్టాలనే డిమాండ్ను తిరస్కరించారు. వీటికి మించి సీమ వాసుల్లో తరతరాలుగా నిబిడీ కృతమై వున్న సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి పూర్తిగా మోసం చేశారని ‘‘సగటు సీమ’’ వాసి భావిస్తున్నారు.
ఈ అంశాలపై నిరంతరం సభలు సమావేశాలు ద్వారా నిరసనలు తెలుపుతున్నారు. ప్రధానంగా యువత సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను పెంచి పోషిస్తోంది. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలో వామపక్షాలు పాదయాత్రలు ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి తోడు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీమ ప్రాజెక్టుల సందర్శన ఈ ప్రభుత్వానికి సంకటస్థితి కల్పించింది. వీటన్నింటినీ మించి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్న రాయలసీమ సాగునీటి నీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామి రెడ్డిపై వున్న పాతకేసు వెలికి తీసి అరెస్టుచేసి రిమాండ్కు పంపారు. ఫలితంగా వెల్లు వెత్తిన నిరసనతో ప్రభుత్వం దిగి వచ్చి విడుదల చేశారు. ఎప్పుడో నమోదైన కేసులో చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి జైలు పాలు చేసినట్లు బొజ్జా దశరథరామి రెడ్డి అరెస్టులో అదే డొంక తిరుగుడు విధానం అమలు చేశారు. దశరథరామి రెడ్డి అరెస్టు సీమలో పుండుపై కారం రాసినట్లయింది.
గత నాలుగన్నరేళ్లుగా జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రదర్శించిన నిర్లక్ష్యం క్షేత్రస్థాయి పరిస్థితి నిశితంగా పరిశీలిస్తే తను కూర్చున్న కొమ్మనే నరక్కున్నాడని చెప్పాలి. రాయలసీమ జిల్లాల్లో రేపు ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయించే తటస్థ ఓటర్లలో భారీ గండిపడక తప్పదు. గోరుచుట్టుపై రోకటి పోటులాగా తనతో రక్తం పంచుకు పుట్టిన షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, అధిష్ఠానం ఆదేశిస్తే ఆంధ్రప్రదేశ్లోనే కాదు అండమాన్ లోనైనా పనిచేస్తానని ఆమె ప్రకటించడంచూస్తే ఆంధ్రప్రదేశ్లోనే మకాం పెట్టడం ఖాయమైనట్లుగానే భావించాలి. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా షర్మిల వస్తే జగన్మోహన్ రెడ్డికి తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చవిచూడని చేదు అనుభవం తప్పదేమో! అనేక మంది వైసీపీి ఎమ్మెల్యేలు ఆమె వెంట నడిచేందుకు సిద్ధమై వున్నారు. జగన్ వడబోతతో ఇంకెంత మంది గోడ దూకుతారో. ముఖ్యమంత్రి జగన్కు మిగిలిందల్లా సంక్షేమాలు పథకాలు. సంక్షేమ పథకాలతోనే రాష్ట్రం రామరాజ్యంగా వర్థిల్లి వుంటే జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ఇస్తున్న ఉచితాలతోనే పేదల బతుకు తెల్లవారేలా వుంటే దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న ఈ ఏడాది రాయలసీమ నుంచి గ్రామాలకు గ్రామాలు వలస బాట పట్టేవి కావు.
విశ్రాంత పాత్రికేయులు
ఫోన్: 9848394013