డా. జి.వెన్నెల గద్దర్
ఎన్నికల కోడ్ రానే వచ్చింది వలస పక్షులు ఇప్పుడిప్పుడే గూళ్లను వెదుక్కుంటూ కుదుటపడుతున్నాయి. బీజేపీ అధికారంలోకి రాకముందు 370 రూపాయలు ఉన్న గ్యాస్ సిలెండర్ 2022లో 1200 రూపాయలైంది, అరవై రూపాయల ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లు రూ.110 కి పెంచి గత వారంలో రెండు రూపాయలు చొప్పున తగ్గించి భారీ వితరణ చాటుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బూటకపు వాగ్దానాలు, బూటకపు గ్యారెంటీతో అప్పనంగా వచ్చిన డబ్బును టీవీ సామాజిక మాధ్యమాలలో ప్రకటనల కోసం తగలేస్తున్నారు. పూట పూటకు ఖరీదైన దుస్తులు ధరించి విలాసవంతమైన హోటళ్లు, విమానాలలో తిరుగుతూ పగటి వేష గాడిని తలదన్నే మాటలు… చేతలు శూన్యంగా ఉంది. చిలకలూరిపేటలో జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్కు తాను ఏమి చేస్తారో, ఏం ఇస్తారో చెప్పలేదు. 2019లో తాను శంకుస్థాపన చేసిన అమరావతి నాశనం అయితే దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. పది సంవత్సరాల క్రితం ఇతర దేశాల్లో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ఒక్కో మనిషికి 15 లక్షలు ఇస్తానన్న సంగతి మరచిపోయారు. సమాన విద్యావకాశాలు లేని నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టి కాషాయీకరణ, వ్యాపారీకరణ, కేంద్రీకరణకు పెద్ద పీట వేస్తున్నారు. ఒక్కటంటే ఒక్క పరిశోధన సంస్థను స్థాపించింది లేదు, కేంద్ర విశ్వవిద్యాలయాలలో పేరెన్నికగల సంస్థలలో ఉద్యోగ క్షీణత నలభై శాతం దాటింది. రాజ్యాంగం నుంచి లౌకికవాదాన్ని తొలగిస్తారన్న భయాన్ని తొలగించలేదు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేయడం గురించి ప్రస్తావించరు. 67 ఏళ్ల అప్పులు రూ.55 లక్షల కోట్లు అయితే మోదీ ఒక్కరే చేసిన అప్పులు రూ. 80 లక్షల కోట్లు గురించి మాట్లాడరు. పెట్రోల్ ధర రూపంలో దోచుకున్న రూ.26 లక్షల కోట్లు గురించి, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వసూలు చేసిన 6900 కోట్ల రూపాయల గురించి నోరుమెదపరు. వ్యాపారస్తులు, కార్పొరేట్లు ఎగవేస్తున్న ఆదాయపు పన్ను గురించి చట్టసభలలో చర్చలేదు. కరోనా ప్యాకేజీ 20 లక్షల కోట్లు, పీఎం కేర్స్ ఫండ్కు వచ్చిన విరాళాల గురించి, ఎనిమిది వేల కోట్లతో విమానానికి తగలేయడం, కార్పొరేటు ప్రైవేటు ఆసుపత్రులు కరోనా టైంలో 6 లక్షల కోట్ల దోపిడి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. మూతపడుతున్న ప్రభుత్వ రంగ సంస్థల గురించి ఏనాడూ చింతించలేదు. హిడెన్ బర్గ్ రిపోర్టు ద్వారా గత సంవత్సరం స్టాక్ మార్కెట్లో సామాన్య మదుపరుల ఆస్తి లక్షల కోట్లు ఆవిరైపోయినా పట్టించుకోలేదు. ఇరవై లక్షల కోట్లు కార్పొరేట్ ఎగవేతదారుల రుణాలను మాఫీ చేయడం, అదానీ ఆస్తులు గత పది సంవత్సరాలలో 26 రెట్లు పెరగడం, కరోనా సమయంలో అంబానీ ఆస్తి గంటకు 90 కోట్లు పెరగడం చూస్తుంటే మోదీ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడో అర్థం అవుతుంది. గిట్టుబాటు ధరలు లేక ప్రతిరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా చీమ కుట్టినట్లు లేకుండా రోజు రాష్ట్రాల వెంట తిరుగుతూ పూటకొక డ్రెస్ మార్చి 400 కి పైగా సీట్లు వచ్చేందుకు మాకు ఓట్లు వేయండి అని అభ్యర్థిస్తున్నారు. దేశంలో ఓబీసీల్లో 983 కులాలకు ఐదేళ్లుగా ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రయోజనాలు అందట్లేదు. మోదీ నేతృత్వంలో చేతగాని పాలన సాగుతోంది, వ్యవస్థలన్నీ పతనమై పోయాయి, నిరుద్యోగం 8.4 శాతం పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు దివాళా తీసేలా చేస్తున్నారు. బీమా, రైల్వే, కమ్యూనికేషన్, చివరికి ఇస్రో, హెచ్ఏఎల్ ప్రైవేటు పరం చేస్తున్నారు. ఆయన ఏదో చేస్తున్నారన్న భ్రమ నుంచి ప్రజలు బయట పడాలి. బహుజనులలోని అన్ని కులాలు ఏకతాటిపైకి వచ్చి రాజకీయంగా బలపడాలి. దేశ జనాభాలో 54% బీసీలే ఉన్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం రిజర్వేషన్లు ఇవ్వకపోవడం బాధాకరం. కులాల లెక్కలు తీయకపోతే బీజేపీ గద్దె దిగి పోవాల్సిందే. ఇప్పటివరకు వారి వాటాతో పాటు బీసీలకు వచ్చే వాటా కూడా అనుభవిస్తున్నారు. కులం పేరుతో వివక్షకు గురైన వర్గాల వారికి సమ ప్రాతినిధ్యం దక్కించడం కోసమే రిజర్వేషన్ల వ్యవస్థ’’ అని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4) , 16(4) లో స్పష్టంగా పేర్కొన్నారు. ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వాల్సినవి సంక్షేమ పథకాలు మాత్రమేనని, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఈబీసీ వర్గాలకు ఎక్కడ నుంచి వచ్చింది. రిజర్వేషన్కు ప్రాతిపదిక కులం (సామాజిక వెనుకబాటు) మాత్రమే, కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటి నుంచి అంతా తారుమారు అవుతుంది. మండల్ కమిషన్ నివేదిక ప్రకారం ఓబీసీల జనాభా 54%, అగ్రకులాల జనాభా ఎంత అనేది తెలియకుండా వారికి పది శాతం రిజర్వేషన్లా?
అసలు ఎందుకు వెయ్యాలో చెప్పలేదు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం లాంటి మీడియా అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు అనుకూలంగావుంటూ కేవలం తమ స్వార్థం కోసం ఊకదంపుడు ఉపన్యాసాలను షేర్ చేస్తున్నది. నిజంగా దేశభక్తి కలిగిన వారయితే, దేశాభివృద్ధి కోరే వారయితే అది నీవైన, నేనైన లేదా ఇంకెవరైనా సరే కుల మతాలకతీతంగా పై అంశాల వంటి వాటి సాధన కోసం పాటుపడాలి. ఇక మోదీ భక్తుల చూపంతా దేవుడు, రామ మందిరం, మతం, కులం, హలాల్, హిజాబ్, మసీదు, జట్కా, ఆవు, పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్, క్రికెట్, వాట్సాప్ సామాజిక మాధ్యమాలలో పైసా ఖర్చు లేకుండా వీటిని ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రలో బీజేపీకి తగిన పునాది లేదు. ఇలాంటి పార్టీకి చంద్రబాబు నాయుడు ఆరు ఎంపీ సీట్లు, పదికి పైగా ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారు. అన్నదమ్ముల వలేె కలిసి ఉన్న ప్రజల మధ్య మతం అంటూ చిచ్చు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో పునాదులు కడుతున్నాడు చంద్రబాబు. టీడీపీలో ఉన్న ముస్లిం సోదరులు ఇప్పటికి అయినా కళ్లు తెరవాలి. ఒక్కసారి బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలను చూడండి. ముస్లిం మహిళలను ఎంత ఇబ్బంది పెట్టారో తెలుస్తుంది. హత్రాస్, బిల్కిస్ బానో కేసు విషయంలో, రెజ్లర్ల లైంగిక వేధింపుల విషయంలో బీజేపీ ధోరణి చూస్తూనే ఉన్నాం. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పండి. చంద్రబాబు బీజేపీ ఓటమి ఎలా ఉండాలి అంటే మళ్లీ రాష్ట్రం వైపు బీజేపీ కన్నెత్తి చూడకుండా ఉండాలి. బీజేపీ నేతలు తమకు 370 సీట్లు సొంతంగానే వస్తాయంటున్నారు. ఆర్టికల్ 370 రద్దు స్ఫురణకు తెస్తూ సొంతంగా 370 వస్తాయని ఊదర గొడుతున్నారు. కేవలం ప్రతిపక్షాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టడానికి చేస్తున్న వ్యాఖ్యలు తప్ప వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నం అని రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారందరికీ తెలిసిందే. ఉత్తర భారత్లో రాష్ట్రాల పరిస్థితి గమనిద్దాం. 80లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ బీజేపీకి ఆయువు పట్టు. గత ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏలోని ఏడీ(ఎస్)తో కలుపుకుని బీజేపీ పొందినవి 64 సీట్లు. గుడి కట్టేశాం కాబట్టి రాముడు తమను కాపాడుతాడు అనేది వారి ఆశ, ఆలోచన. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. గత పదేళ్లుగా అక్కడ జరిగిన అభివృద్ధి శూన్యం. ఆ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో జాతీయ ఆదాయానికి వచ్చిన సొమ్ములో రెండింతలకన్నా ఎక్కువగా అక్కడికే తరలించినా ప్రగతి లేదు. రాష్ట్రమంతా నిరుద్యోగం విలయ తాండవం చేస్తోంది. ఇటీవల పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు విడుదలైన ప్రకటనలో 60 వేల ఉద్యోగాలకు 50 లక్షల మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారంటే అక్కడి నిరుద్యోగ పరిస్థితి ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. పేదరికం తగ్గకపోగా ఉచిత బియ్యం పొందే జనాభా పెరిగింది. పులి మీద పుట్రలా నిత్యావసరాల ధరల పెరుగుదల జనాగ్రహానికి కారణవుతున్నది. ఇది ఎక్కడా బయటకు కనిపించని ధర్మాగ్రహం. సామాన్యుడు నిత్యం తన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడు. తన చేతికి చిక్కే ఓటు అవకాశం మాత్రం వదులుకోడు. ఇక బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, దిల్లీ ో ఎదురు గాలి వీస్తున్న మాట నిజమవుతుంది. మతసామరస్యం, శాంతి, సౌభ్రాతృత్వం ప్రతి మనిషి జీవన విధానం కావాలని ప్రజలు గ్రహించినప్పుడే పరిస్థితి మారుతుంది. మత విద్వేషాలను ప్రేరేపించే విధానాలు దేశ సార్వభౌమత్వానికి ప్రమాదకరమని ప్రజలు గ్రహించాలి. మెరుగైన సమాజానికి మూలస్థంభాలైన విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం, సాధికారత, విలువలు, సామాజిక సమగ్రతను ప్రజలు విస్మరించి కేవలం మతం పట్టుకుని వేలాడడం తీవ్ర ప్రమాదం అని గ్రహించాలి. మతోన్మాదం మెజారిటీ తరహా అయినా, మైనారిటీ తరహా అయినా ప్రమాదకరమే. అన్ని రకాల మతోన్మాదాన్ని నిశితంగా వ్యతిరేకించాలి, ప్రతిఘటించాలి. బీజేపీ ప్రభుత్వ విధానాలు, సంఘ పరివార్ కార్యక్రమాలు లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం పునాదులను ధ్వంసం చేస్తున్నాయి. సంఘపరివార్ శక్తుల విభజనవాద, ఫాసిస్టు తరహా చర్యలు శ్రామిక ప్రజల వర్గ ఐక్యతను, దేశ సమగ్రతను దెబ్బ తీస్తుంది.