చెప్పేది మంచి అయినప్పుడు ‘వినదగునెవ్వరు చెప్పిన’ అన్నది కరెక్టే. ద్వేషభావం, కోపం, బాధ కలిగించనివి, అసత్యాలు కానివి చెప్పడమైనా, వినడమైనా మంచిదే. కానీ నేడు ఆ సంస్కృతి కనపడడంలేదు. సెల్ఫోన్ విచ్చలవిడి వాడకం మొదలైనప్పటి నుంచి సంభాషణల విలువ అథఃపాతాళానికి దిగజారింది. ఉన్నావా? తిన్నావా? పడుకున్నావా? లాంటి తేలికపదాలు, బూతు కవరింగుల ద్వంద్వార్థాల దాకా విలువలేని మాటలే వినసొంపవు తున్నాయి. ‘వ్యథా లాపన-వృథా కాలయాపన’ జరుగుతోంది. వ్యక్తిగత విషయాలు వదిలేస్తే సామాజిక, రాజకీయ విషయాలకు సంబంధించిన వితండవాదన, విపరీత ధోరణి, విశృంఖల సంభాషణలు, వినలేని, రాయలేని మాటలతో కొత్తపుంతలు తొక్కుతూ జర్నలిజం పేరుతో అనేక చిన్నా చితకా యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా వేదికలు, వారు చెప్పిందే వార్త అన్నట్టు వారి వ్యక్తిగత అభిప్రాయాలను వినాల్సిందే అన్నట్లుగా ప్రజలకు విషయంలో విషాన్ని కలిపి బుర్రలోకి ఎక్కిస్తున్నారు. కొన్ని జాతీయ, స్థానిక దినపత్రికలు, ఛానల్స్ కూడా ఏదో ఒక రాజకీయ నీడలో అక్షరాలకు హంగులద్దుతూ ఆ రంగులు ప్రజలకు పులిమే ప్రయత్నం చేస్తున్నాయి.
యూ ట్యూబులో ఛానల్ ఓపన్ చేయగలిగే జడపదార్ధం కూడా జర్నలిజం ఆకారమై, విశృంఖలతకు ప్రాకారమవు తోంది. పుంఖాను పుంఖాలుగా, ఆరోగ్యం, వైరాగ్యం, భక్తి, ముక్తి, విరక్తి, విముక్తి, రాజకీయం, అరాచకీయం ఏదైనా వారి సొంత అభిప్రాయాల కలబోతను మనకు సూక్తిముక్తావళిగా వినిపిస్తున్నాయి. శృంగారాలు, శృతిమించడాలు కూడా ప్రసారాలకు కొత్తదారులు వెతుక్కుంటూ కోరుకున్నవాళ్ళకు కనువిందు చేస్తూనే ఉన్నాయి. ‘అంతా నాయిష్టం’ అనుకుం టున్న కొన్ని మీడియా వేదికల్లో కనీసం మన వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తం చేయడానికి కూడా రాజకీయ పార్టీల అనుమతో, సోషల్ మీడియా అనుమతో తీసుకువాల్సిన దుర్గతి నెలకొంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 2000 నాటి చట్టప్రకారం అశ్లీల వెబ్సైట్లను, ఓటీటీ ప్లాట్ఫాంలను కొన్నింటిని తొలగించే చర్య తీసుకుంది.
అధునాతన నాగరికతను ఉదాత్తంగా వంటబట్టించుకున్న వారు కొందరు దీన్ని వ్యతిరేకించినా చర్యలు మంచికోసం చేసినవిగా గుర్తించాలి. సోషల్ మీడియా వేదికగా ఎన్నో వ్యాపార, ఉద్యోగ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకొని అభివృద్ధితో జీవితాలను మార్చుకుని కీర్తిగడిరచిన వారెందరో ఉన్నారు. కానీ భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో వ్యక్తిగత హననం, అవాస్తవాల ప్రచారాలకు ఈ వేదికలను ఉపయోగించే వారిపై నియంత్రణకు కఠినమైన చట్టాలు లేకపోవడం విచారకరం. ప్రభుత్వాల మీద బురదజల్లే వ్యక్తులు, ఛానళ్లు మాత్రం కేసుల పాలవుతున్నారు. వ్యవస్థీకృతంగా జరిగే నేరాలపైన చర్యలు అంత వేగవంతంగా లేకపోవడంవల్ల అనేకమంది ఇబ్బందుల పాలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో మహిళలపై మహిళలే అసభ్యకరంగా పోస్టులు పెట్టడం ఈ సమాజంలోని భ్రష్టుత్వాన్ని బహిరంగ పరుస్తోంది. పార్టీలు, ప్రభుత్వాలు, నాయకులపట్ల లేక ఈ సమాజం పట్ల ఏ మనిషికైనా ఉన్న వ్యక్తిగత అభిప్రాయాన్ని సున్నితంగా భావ వ్యక్తీకరణ చేయడంలో తప్పులేదు. కానీ తమకు భజన చేయనివారందరినీ బలి తీసుకుంటామంటే మాత్రం అది ఆమోదించవలసిన విషయం కాదు. కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతికత సరైన రీతిలో ఉపయోగించుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత.
జోస్యుల వేణుగోపాల్
సెల్: 9440436806