ఏ దేశంలో మూఢ నమ్మకాలు తక్కువగా ఉంటాయో అ దేశం అంతగా అభివృద్ది పథóంలో ముందుకుపోతుంది. మన దేశంలొ ముఖ్యంగా తరతరాలుగా పెద్దల నుంచి వస్తున్న ఆచారాలు, సంప్రదాయాల పేరుతో ఛాందస భావాలను ప్రజల వదులుకోలేకపోతున్నారు. సైన్సు ఎంతగా అభివృద్ది చెందినా మన మెదళ్లలో మన తాతయ్యలు, అమ్మమ్మలు నూరిపోసిన దేవుడూ, దెయ్యం, అడుగో బూచోడు లాంటి మాటలు, పుక్కిటి పురాణాలు, మంత్రాలు శాపాల బారి నుంచి బయటపడలేకపోవటం విచారకరం. ఎంత చదువుకున్నా శాస్త్రీయ దృక్పథం లోపించిన కారణంగా వైద్యులు సైతం మృత్యుంజయ యాగాలు చేస్తున్నారు. విద్యార్థులకు శాస్త్రీయవిద్య అందించాల్సిన అనంతపురం కేడీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు యూనివర్సిటీలలో మృత్యుంజయ యాగాలు చేస్తున్నారు. వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటిలో భూతవైద్యాన్ని కోర్సులుగా పెడుతున్నారు. ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలలో వాస్తు జ్యోతిష్యాలను కోర్సులుగా పెట్టి, జనాన్ని మోసం చేసి బ్రతకండని సర్టిఫికెట్లు ఇస్తున్నారు. పదార్ధం సృష్టించబడదు , నాశనంకాదు, మార్పుచెందుతుంది అని విద్యార్ధులకు భోదించే ఫిజిక్స్ ప్రొఫెసర్ ఎవరో ఒక బాబా నొట్లోంచి లింగం తీస్తే, అమాంతం వెళ్లి ఆయన కాళ్లకు సాష్టాంగపడుతున్నారు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకదానిచుట్టూ ఒకటి తిరిగే క్రమంలో సూర్య గ్రహణం , చంద్రగ్రహణం ఏర్పడుతాయని పాఠాలు చెప్పే సైన్సు మాస్టర్లు గ్రహణం రోజు గ్రహణ సమయంలో కదిల్తే అరిష్టమని దుప్పటి కప్పుకుని పడుకునే వారు ఉన్నారు.
అర్టికల్ 51 ఏ (హెచ్)లో రాసుకున్న ప్రశ్నించేతత్వం, శాస్త్రీయ అలోచన, మానవవాదాన్ని పెంచటం ప్రతి పౌరుని బాధ్యత అన్న సూత్రాలను అమలుపరుస్తామని ప్రమాణం చేసిన ప్రధాని మోదీ ఒక సైన్సు కాంగ్రెసు సభలో పురాణాలలో వినాయకుని తల, ఏనుగు తొండంతో అతికించడాన్ని నేడు జరుగుతున్న సర్జరీలతో పోల్చిచెప్పారంటే పాలకులు ఎంత అజ్ఞానంలో కూరుకుపోయారో ఉహించుకోవచ్చు. ప్రధానులకు సైతం సైన్సు తెలియదు అనుకోవాలా? లేక నాటకాలు ఆడుతున్నారు అనుకోవాలా !!
ప్రభుత్వ భూములు ఆక్రమించి ఆశ్రమాల పేరుతో మోసంచేస్తున్న బాబాల వద్దకు అధికారికంగా వెళ్లి సాష్టాంగపడుతున్న ఐఏఎస్ లు, ఐపీఎస్లు, గవర్నర్లు, ప్రజాప్రతినిధులు రాజ్యాంగంలోని లౌకికవాదాన్ని మంటగలుపుతున్నా అడిగేవాడు లేడు. ఆధునిక విజ్ఞానంతో తయారుచేసిన ప్రచారసాధనాలు అనగా టీవీలు , రేడియోలలో రంగురాళ్లు మీ జీవితాలు మారుస్తాయని, పేరు మార్చుకుంటే మీ జీవితాలు మారతాయని, పలానా రుద్రాక్షలు ధరిస్తే జీవితాలు మారతాయని అశాస్త్రీయమైన వాస్తు, జ్యోతిష్యాలను బోధించటం , అష్టలక్ష్మి యంత్రాలు ధరిస్తే లక్ష్మీఅమ్మవారు మీయింట తిష్టవేస్తుంది అని ప్రచారంచేసే ప్రకటనల వలన అమాయక ప్రజలు తమ ధన మాన ప్రాణాలను పోగొట్టుకుంటున్నా ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. 2019లో కర్నాటక ముఖ్యమంత్రి యదియురప్ప ఎవరో సంఖ్యా శాస్త్రజ్ఞుడు చెప్పారని తనపేరుని యడియారప్ప గామార్చుకున్నారు. ఆ మధ్య మదనపల్లిలో ఒక బాబా బోధనలకులోనై తలిదండ్రులు తమ ఇద్దరి అమ్మాయిలను అత్యంత కిరాతకంగా చంపారు. గోదావరి జిల్లాలో యేసుప్రభు పిలుస్తున్నాడంటూ ముగ్గురు మహిళలు ఉరివేసుకుని చనిపోయారు. కేరళలో ఒక ముస్లిం మహిళ ఆరు సంవత్సరాల కొడుకుని దేవునికి బలి ఇచ్చింది. ఈ రకంగా దేశంలో మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి. అరికట్టవలసిన ఆధికారులు సైతం మూఢ నమ్మకాలతో మునిగిపోతున్నారు. వీటికి విరుగుడు ఒక్కటే. మూఢనమ్మకాల నిర్ములనచట్టం. మూఢ నమ్మకాలను ప్రోత్సహించే వారి పైనా, వాటిని ప్రచారం చేసేవారి పైనా చర్యలకు చట్టం ఉండాలి. కర్నాటక , మహరాష్ట్ర మరికొన్ని రాష్ట్రాలలో ఉన్నట్లుగా మన రాష్ట్రంలో కూడా మూఢనమ్మకాల నిర్ములనచట్టం ఎంతో అవసరం ఉంది. అందుకోసం రాష్ట్రాల్లోని అన్ని హేతువాద, నాస్తిక సంఘాలూ, జేవీవీ ఇతర అభ్యుదయ సంఘాలు కలసి పోరాడవలసిన అవసరం ఉంది .
నార్నె వెంకటసుబ్బయ్య
ఏపీ హేతువాదసంఘం అధ్యక్షుడు