అనంతపురం జిల్లా
-రాప్తాడు ఎన్నికల నమోదు అధికారి వసంతబాబు
విశాలాంధ్ర-రాప్తాడు : ఏపీలో లోకసభ, శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల 18వ తేదీన రానుందని.. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల నియమావళి ఖచ్చితంగా పాటించాల్సిందేనని
రాప్తాడు ఎన్నికల నమోదు అధికారి వసంతబాబు తెలిపారు. శుక్రవారం ఆయన రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు ఏప్రిల్ 25వ తేదీ వరకూ అవకాశం ఉందని… అదే నెల 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఏప్రిల్ 29వ తేదీ వరకూ గడువు ఉందన్నారు. మే 13న ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4వ తేదీ ఫలితాలు వెల్లడికానున్నాయన్నారు.
నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలూ చేపట్టామని.. దీనిపట్ల అందరూ ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగులెవరూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరాదన్నారు. ఎన్నికల ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపట్టేందుకు దృష్టి సారించేలా, ఎక్కడా లోపాలు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో ఎంసిసి బృందాలు వ్యయ ఖర్చులు, ప్రకటనలు, ప్రచారాలు, కార్యక్రమాలు ఇతర అంశాలను పరిశీలించేందుకు ఎఫ్.ఎస్.టీ, ఎంసిసి టీంలు మోడల్ కోడ్ ఆఫ్ కాండెక్ట్ అమలు చేస్తాయన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఎన్నికల నియమావళిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హార్డింగ్లు, పోస్టర్లు, కటౌట్లు తదితర ప్రచార సామగ్రిని ఇప్పటికే తొలగించామని ఇంకా ఎక్కడైనా ఉన్న తమ దృష్టికి తీసుకు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నిబంధనలను పటిష్టంగా అమలు పర్చేలా జాగ్రత్త వస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆరు మండలాల ఏఈఆర్ఓలు, డీటీలు, సిబ్బంది పాల్గొన్నారు.