విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) :మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు ఏఐటియుసి ఆధ్వర్యంలో బుధవారం మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ ఏఐకెఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ మే డేకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత ఉందని, వేలాది మంది కార్మికులు 1886 మే 1న చికాగో నగరంలో హే మార్కెట్ వద్ద పని గంటలు తగ్గించాలని పని భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ అమెరికా పెట్టుబడిదారీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారని గుర్తు చేశారు. దేశంలో ఎక్కువ మంది కార్మికులు ఉన్నారని, ఆయా రంగాల్లో పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారన్నారు. కార్మికులకు సరిపడే విధంగా జీతాలు ఇవ్వాలని, 8 గంటలే పని కల్పించాలని, పని ప్రదేశాల్లో కార్మికులకు ప్రమాదాలు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించి తగిన న్యాయం చేసి కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు ఎర్రజెండా ఎల్లప్పుడూ తోడు ఉంటుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమ్మరి చంద్ర, నాగరాజు, లక్ష్మన్న, బసవరాజు, నాగప్ప, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.