భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి మూలపేట పోర్టు కు 6లైన్ల రహాదారి
విశాలాంధ్ర- సంతబొమ్మాలి : ( శ్రీకాకుళం) శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మూలపేట పోర్టుపనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు సోమవారము పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావనపాడు పోర్టుగా ఉన్న పేరును మూలపేట పోర్టుగా మార్చారని, అలాగే భావనపాడు హార్బర్ కు మూలపేట పోర్టుకు అనుసంధానం చేసే అభివృద్ది పనులు జరిపేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు. భోగాపురం పోర్టు నుంచి ఎయిర్పోర్ట్ నుంచి మూలపేట పోర్టు వరకు ఆరు లైన్ల రహదారి నిర్మించడం జరుగుతుందని ఈ మేరకు ప్రధాన మంత్రికి లేఖ రాయడం జరిగిందని అన్నారు. విమానయాన శాఖ మంత్రి ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆ శాఖకు మంత్రిగా ఉండటం వల్ల భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో పనులు పూర్తి చేసుకునే దశకు వస్తుందని అన్నారు. పక్కనే ఉన్న ఎపిఐఐ సి భూములు ఎనిమిది వేల ఎకరాల్లో మరికొన్ని పరిశ్రమలు నెలకొల్పే దిశలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని అన్నారు. అలాగే మూలపేట పోర్టు రానున్న ఏడాది జూన్ నెలలో పూర్తవుతుందని, స్థానికంగా ఉన్నవారికి ఉపాధి అవకాశాలు మెండుగా లభించే అవకాశం ఉందని దీంతో వలసలు నివారించవచ్చునని ఆయన అన్నారు. అంతకుముందు మూలపేట పోర్టులో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులను మంత్రితో పాటు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిరాకర్ కు తో పాటు పోర్ట్ అధికారులు పరిశీలించారు. అనంతరం సమావేశం మందిరంలో పోర్టు అభివృద్ధిపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. మంత్రితో పాటు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీరు భీమారావు, కోటబొమ్మాలి మాజీ పిఎసిఎస్ అధ్యక్షుడు కింజరాపు హరివర ప్రసాద్, సంతబొమ్మాలి మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి అప్పన్న, తెలుగుదేశం పార్టీ నాయకులు శవాన ప్రసాదరావు, తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు ఉన్నారు.