కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో వాటాపై కూనంనేని
విశాలాంధ్ర- కొత్తగూడెం క్రైమ్: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాట చెల్లింపును సాధించిన ఘనత ఏఐటీయూసీ దేనని, ఇది సాధించుకోవడం చారిత్రాత్మకమని కొత్తగూడెం ఎమ్మెల్యే, గుర్తింపు యూనియన్ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు అన్నారు. స్థానిక రైటర్ బస్తీలోని సింగరేణి సివిల్ డిపార్టుమెంట్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అయన మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ కాంట్రాక్టు కార్మికులను నిర్లక్ష్యం చేసిందన్నారు. కార్మికులు కష్టించి సాధించిపెట్టిన సొమ్ముని దిగమింగడమే తప్ప కార్మికుల సంక్షేమాన్ని బీఆర్ఎస్ పార్టీ, దాని అనుబంధ యూనియన్ పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ఫలితంగానే లాభాలవాటా అమల్లోకి వచ్చిందన్నారు. కాంట్రాక్టు కార్మికుల వేతన జీవో 22ను సింగరేణిలో అమలు చేసేవిధంగా పాలకులపై వత్తిడి తెస్తున్నామన్నారు. ఖాళీ క్వార్టర్లు, సింగరేణి ఖాళీ స్థలాలను కాంట్రాక్టు కార్మికులకు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, సివిల్ విభాగం అధికారులు పి.రాజశేఖర్, కరుణాకర్ రెడ్డి, సీహెచ్ సాంబశివరావు, ఏఐటీయూసీ నాయకులు ఎస్వీ రమణమూర్తి, కిష్టాఫర్, ఎర్రగాని కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.