మంత్రి కేటీఆర్
విశాలాంధ్ర-హైదరాబాద్ : మూడు ఎకరాల రైతుకు మూడుపూటలా కరెంట్ ఎందుకు అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం విడ్డురంగా ఉందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఅర్ నినాదం ‘మూడు పంటలు’… కాంగ్రెస్ విధానం ‘మూడు గంటలు’… బీజేపీ విధానం ‘మతం పేరిట మంటలు’… ఇందులో ఏది కావాలో తెలంగాణ రైతులు తేల్చుకోవాల్సిన తరుణం ఇదని కేటీఆర్ ట్వీట్ చేశారు. రైతుల పట్ల మొదటి నుంచి చిన్నచూపుతో ఉన్న కాంగ్రెస్ నోట రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక వచ్చిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని చెప్పిన రాబందు… ఇప్పుడు మూడు గంటల కరెంట్ చాలు అంటున్నడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ పేర్కొన్నారు. నాడు వ్యవసాయం దండగ అని పెద్ద చంద్రబాబు అంటే నేడు మూడుపూటలు కరెంట్ దండగ అని చోటా చంద్రబాబు అంటున్నారని మండిపడ్డారు. మూడు ఎకరాల రైతుకు మూడుపూటలా కరెంట్ ఎందుకు అనడం విడ్డురంగా ఉందన్నారు. ఈ మాటలు ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమే అని పేర్కొన్నారు. నోట్లు తప్ప, రైతుల పాట్లు తెల్వని రాబందును నమ్మితే రైతు నోట్లో మట్టికొట్టుడు ఖాయమని, అన్నదాత నిండా మునుగుడు పక్కా అని అన్నారు. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏడు గంటలు కరెంట్ ఇవ్వకుండా రైతులను గోస పెట్టిందని, నేడు ఉచిత కరెంట్ కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోందన్నారు. మూడుగంటలతో 3 ఎకరాల పొలానికి నీరు పారించాలంటే బక్కచిక్కిన రైతు బాహుబలి మోటార్లు పెట్టాల్సి వస్తుందన్నారు. అరికాలిలో మెదడు ఉన్నోళ్లను నమ్ముకుంటే రైతుల బతుకు ఆగం అవుతుందని హెచ్చరించారు. మరోసారి రాబందు 3 గంటల మాటెత్తితే రైతుల చేతిలో మాడు పగలడం ఖాయమన్నారు.
తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయం అని రైతును రాజును చేసే మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలా లేక 3 గంటలు చాలన్న మోసకారి రాబందు కావాలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.