విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి జాతీయ పతాకావిష్కరణ చేసి, జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం పెరేడ్ వీక్షణ చేసి, సాయుధ దళాల నుంచి జిల్లా కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. ఇందులో జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, నగర పాలక సంస్థ మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ లు కోగటం విజయ భాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్, ఆర్టీసీ జోనల్ చైర్ పర్సన్ మంజుల, ఎడిసిసి బ్యాంక్ చైర్ పర్సన్ లిఖిత, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్ పర్సన్ ఉమాదేవి, డిఎఫ్ఓ వినీత్ కుమార్, ఏఎస్పీలు విజయభాస్కర్ రెడ్డి, హనుమంతు, డిఆర్ఓ గాయత్రీ దేవి, ఆర్డీఓలు గ్రంధి వెంకటేష్, రాణిసుస్మిత, వి.శ్రీనివాసులు రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, పెద్దఎత్తున ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గణతంత్ర దినోత్సవ సందేశం ఇచ్చారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 75వ భారత గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ఈ వేడుకలలో పాల్గొనడానికి విచ్చేసిన స్వాతంత్య్ర సమరయోధులకు, పురప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, విద్యార్థినీ విద్యార్థులకు, పాత్రికేయులకు, జిల్లా ప్రజలందరికీ హృదయ పూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. దేశ స్వాతంత్య్రం, భారత రాజ్యాంగం కోసం కృషి చేసిన ఎందరో త్యాగధనులు, మహనీయులందరికీ వినమ్ర శ్రద్ధాంజలి. అనంతపురము జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి సారధ్యంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.