టీడీపీ క్యాడర్ అంతా నా కుటుంబం
- మా మధ్య చిచ్చు పెట్టి లబ్ధిపొందాలన్నదే ధర్మాన వ్యూహం
- మమ్మల్ని విడగొట్టి విజయం పొందాలని వైసీపీ చూస్తోంది
- అందుకే తన సొంత మీడియాలో తనపై తప్పుడు రాతలు
- అందరినీ కలుపుకొని వెళ్లడమే నా ముందున్న లక్ష్యం
- చిన్నచిన్న కోపతాపాలు ఉన్న త్వరలోనే అంతా ఒక్కటిగా వైసీపీపై పోరాడుతాం
- మా అందరి జెండా అజెండా ఒక్కటే కూటమి గెలుపు… వైసీపీ ఓటమి
- తెలుగుదేశం- జనసేన- బిజెపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థి గొండు శంకర్
విశాలాంధ్ర – శ్రీకాకుళం టౌన్: మంత్రి ధర్మాన ప్రసాదరావులో ఓటమి భయం మొదలైంది… అందుకే తన అనుకూల మీడియాలో తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని తెలుగుదేశం- జనసేన- బిజెపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. నగరంలోని విశాఖ ఎ కాలనీలో ఉన్న తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అంతా నా కుటుంబమేనని అందరం కలసి ఒక్కతాటిపై నిలిచి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మా మధ్య చిచ్చుపెట్టి మమ్మల్ని విడగొట్టి తన ద్వారా విజయం పొందాలని ధర్మాన ప్రసాదరావు ఆశిస్తున్నారని ఇది ఎప్పటికీ జరగదన్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా ఒక్కటిగానే ఉందని మా అందరి జెండా అజెండా ఒక్కటే తెలుగుదేశం, జనసేన, బిజెపీ కూటమి గెలుపు… వైసీపీ ఓటమేనని పేర్కొన్నారు. అందరినీ కలుపుకొని వెళ్లడమే ఇప్పడు తన ముందుకు లక్ష్యమని తెలిపారు. తాను ఏనాడూ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై హుకుం జారీ చేయలేదని ఇది ధర్మాన వ్యహమని గ్రహించాలని ప్రజలను కోరారు. జనసేన, టీడీపీ, బీజెపీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ తాను ప్రచారంలో దూసుకుపోతుండడంతో ధర్మాన ప్రసాదరావు వెన్నులో వణుకు పుడుతోందని అన్నారు. అందుకే సింగుపురంలోని కళింగ కోమట్లను బలవంతంగా తీసుకెళ్లి కండువాలు వేసి తన బలంగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ధర్మాన ప్రసాదరావు మాదిరిగా తాను ఎవ్వరినీ భయపెట్టడం లేదని ఆ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. ధర్మానలా ఎన్నికల ముందు రాజకీయాలు చేయడం తనకు తెలియదనని నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్నానని వివరించారు. గత కొన్నేళ్లుగా నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకున్నానని, తాను గెలిచిన వెంటనే అందరి సమస్యలను పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తానని చెప్పారు. మూడు పార్టీల కార్యకర్తలు, నాయకుల నుంచి వస్తున్న సహకారం ఎప్పటి మరిచిపోలేనని, అందరూ సహకారంతో కూటమి అభ్యర్థిగా అఖండ విజయం సాధించి తీరుతామని ఈ సందర్భంగా చెప్పారు. - తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు:
నియోజకవర్గంలోని కొందరు ముఖ్యనేతలు ఇప్పుడు తనతో కలసి వస్తే తాను వారికి ప్రాధాన్యం ఇవ్వనని, ముందు నుంచే తనతో ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తానని కొందరు చెబుతుండడం చూస్తే బాధ తగుతోందని గొండు శంకర్ అన్నారు. తాను ఏనాడూ పదవుల కోసం పని చేయలేదని తెలుగుదేశం పార్టీ బలోపేతమే తన ధ్యేయమని చెప్పారు. తనతో కలసి వచ్చినా, రాకున్నా అందరూ నా కుటుంబ సభ్యులేనని, పార్టీ కోసం పని చేసేలా ప్రతి ఒక్కరికీ కలుస్తున్నానని చెప్పారు. గతంలో జరిగిన సంఘటనలు ఏమీ గుర్తు చేసుకోవద్దని, తనను మీ కుటుంబ సభ్యుడిగా, సోదరుడిగా భావించి మీలో ఒకడిగా అవకాశం కల్పించాలని కోరారు. పార్టీలో ఎవరి ప్రాధాన్యం వారికే ఉంటుందని, ముందు వచ్చినా, వెనుక వచ్చినా అందరూ నా కుటుంబ సభ్యులేనని, పార్టీలో ఎవరి స్థాయి వారిదేనని చెప్పారు. నా వెంట నడిచే వారి ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా నడుచుకుంటానే తప్ప వారి ఆత్మగౌరవానికి ఏనాడూ భంగం కలిగించనని ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ చేతులు జోడించి అడుగుతున్నా తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు… నేను మీ వాడిగానే ఉంటా…! మీతోనే ఉంటా…! అందరమూ కలసి అన్నదమ్ముల్లా పనిచేద్దాం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని గెలుపించుదామని గొండు శంకర్ కోరారు. నియోజకవర్గంలో ధర్మానను ఓడించాలంటే ఇప్పుడు మీ సలహాలు, సూచనలు అవసరం అన్నారు. మీ అందరి సహాయసహకారాల కోసం ఎదురుచూస్తున్నానని, అందరి కలసి ఒక్క కుటుంబంలా ముందుకు పోతే వైసీపీని చిత్తు ఓడించవచ్చునని శంకర్ పిలుపునిచ్చారు.