జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి
విశాలాంధ్ర విజయనగరం : ఏప్రెల్ 14వ తేదీ లోగా కొత్తగా ఓటు నమోదు కోసం దరఖాస్తురఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. ఇలా వచ్చిన దరఖాస్తులను 25వ తేదీలోగా పరిశీలించి, అర్హులైనవారికి ఓటుహక్కు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఏప్రెల్ 14 తరువాత కూడా ఓటుకోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నప్పటికీ, వాటిని పరిశీలించి ఓటుహక్కు కల్పించేందుకు పరిపడా సమయం ఉండదని ఆమె స్పష్టం చేశారు.
వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తన ఛాంబర్లో బుధవారం కలెక్టర్ సమావేశమయ్యారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలపై చర్చించారు. ఈ వారంలో వచ్చిన ధరఖాస్తుల వివరాలను కలెక్టర్ వెళ్లడించారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు చేసే ఖర్చు అంతా పార్టీ ఖాతాలోకి వెళ్తుందని, నామినేషన్లు వేసిన తరువాత అభ్యర్ధుల ఖాతాలో లెక్కిస్తారని చెప్పారు. ర్యాలీలు, ప్రదర్శనలు, ఇంటింటి ప్రచారం, పాంప్లేట్ల పంపిణీకి కూడా అభ్యర్థులు సంబంధి ఆర్ఓల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. రెండుమూడు రోజులకు ముందే ధరఖాస్తు చేయాలని, వీలైనంత త్వరగా అనుమతులు జారీ చేస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటి మీడియాల్లో ఇచ్చే ప్రకటనలు, నిబంధనలు, వాటి ధరలను కలెక్టర్ వివరించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, డిఆర్ఓ ఎస్డి అనిత, ఆర్ఓలు మురళీకృష్ణ, నూకరాజు, ఎన్నికల విభాగం సూపరింటిండెంట్ ప్రభాకర్, రాజకీయ పార్టీలనుంచి రొంగలి పోతన్న, శ్రీనివాసరెడ్డి, నర్సింహరావు, సోములు, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.