నగరపాలక ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి
విశాలాంధ్ర -విజయనగరం టౌన్ అన్ని జాగ్రత్తలతో వీధి కుక్కలకు సంతానోత్పత్తి నిరోధక శస్త్ర చికిత్సలు నిర్వహించామని నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఎం ఎం నాయుడు ఆదేశాల మేరకు బుధవారం కొత్తపేటలో ఉన్న స్టెరిలైజేషన్ సెంటర్ కు చేరుకుని కుక్కలకు నిర్వహిస్తున్న శాస్త్ర చికిత్సలు, యాంటీ రాబిస్ టీకాలు చేపట్టే విధానాన్ని కమిటీ సభ్యులతో కలిసి ఆయన పరిశీలించారు. పశుసంవర్ధక శాఖ, జంతు సంక్షేమ సంఘం, బ్లూ క్రాస్ మరియు ప్రజారోగ్య శాఖ సంయుక్త పర్యవేక్షణలో కుక్కలకు వ్యాధి నిరోధక, సంతానోత్పత్తి నిరోధక శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్టెరిలైజేషన్ సెంటర్ కు చేరుకున్న కమిటీ సభ్యులు ముందుగా పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పరిశుభ్ర వాతావరణంలో కుక్కలకు చికిత్సలు ప్రారంభించారు. అనంతరం నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి మాట్లాడుతూ ఏప్రిల్ 19 నుండి నేటి వరకు 1,395 కుక్కలకు యాంటీ రాబిస్ టీకాలను, సంతానోత్పత్తి నిరోధక శస్త్ర చికిత్సలను నిర్వహించామన్నారు. శస్త్ర చికిత్సలు పూర్తయిన వెంటనే 6 రోజులపాటు ప్రత్యేక పర్యవేక్షణలో స్టెరిలైజేషన్ సెంటర్ వద్ద వాటిని ఉంచుతున్నామన్నారు. వాటికి అవసరమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. పూర్తి ఆరోగ్యానికి చేరుకున్న కుక్కలను విడిచి పెడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ సర్జన్ టి. మోహన్, జంతు సంక్షేమ సంఘం అధ్యక్షులు లోగిస రామకృష్ణ, బ్లూ క్రాస్ ప్రతినిధి మద్దిల సోంబాబు, ప్రజారోగ్య సిబ్బంది పాల్గొన్నారు.