విశాలాంధ్ర – విజయనగరం అర్బన్ : విజయనగరం జిల్లా కేంద్రంలోని మహారాజుపేట ప్రాంతంలో (రింగు రోడ్డు) అక్రమంగా నిర్మిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం భవనంను గురువారం విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు మరియు జనసేన, బీజేపీ పార్టీ నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్బంగా శాసనసభ్యురాలు అదితి గజపతి రాజు మాట్లాడుతూ ఈ వైసిపి పార్టీ కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించారని, వైకాపా అధికారంలో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా చేసారని అన్నారు. వైసిపి అంటేనే భూ ఆక్రమణలు, భూ దందాలు, అక్రమ కట్టడాలకు ప్రతిరూపమని, అందులో వారు నెంబర్ వన్ అని విమర్శించారు.
వైసిపి నాయకులు వారు చేయలేని పనులకు కూడా ద్విశతక శంకుస్థాపనలు అని కొబ్బరికాయలు కొడుతూ షో వర్క్ చేసేవారని, ఒక చిన్న బల్బు మార్చినా పెద్ద కొబ్బరికాయ కొట్టి హడావిడి చేసే వైసిపి వారు, ఇంత సీక్రెట్ గా ఎవరికీ తెలియకుండా ఈ పార్టీ కార్యాలయం నిర్మాణం చేస్తున్నారని ప్రజలు అనుమానం వ్యక్తం చేసారని అన్నారు.
వైసిపి పార్టీ కార్యాలయం అక్రమంగా నిర్మిస్తున్నారని, ఇటువంటి ప్రజా వ్యతిరేక పనులను ప్రజలు ఎల్లప్పుడూ గమనిస్తారని అన్నారు. అందుకే ఇటీవల జరిగిన ఎన్నిలలలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, బాధ్యత కలిగిన ప్రభుత్వం కావాలని, ప్రభుత్వ యంత్రాంగం వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ఈ విషయంలో రెవెన్యూ శాఖ పూర్తిగా విఫలం అయింది అన్నారు. మేము ప్రతిపక్షంలో ఉండగా ఈ విషయమై తెలుగు యువత అధ్యక్షడు గంటా రవి గారు ఆర్టీఐ యాక్ట్ ద్వారా సమాచారం కోరినా ఎటువంటి సమాచారం ఇవ్వలేదని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి ఇదేవిధంగా అక్రమంగా పార్టీ కార్యాలయాలను నిర్మిస్తుందని, అటువంటి అక్రమాలను ప్రజలకు తెలియజేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో అన్ని సక్రమంగా, చట్టప్రకారం జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపీ రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు కార్యదర్శి గంటా పోలినాయుడు, రాష్ట్ర బీసీ నాయకులు వేచలపు శ్రీనివాసరావు, కార్యాలయ కార్యదర్శి రాజేష్ బాబు, అవనాపు విజయ్, పిల్లా విజయ్ కుమార్, గాడు అప్పారావు, పాశి అప్పలనాయుడు, కండువా ప్రకాష్, జనసేన నాయకులు శాంతి, రౌతు సతీష్ , ఉమ్మడి పార్టీల నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.