విశాలాంధ్ర – విశాలాంధ్ర విజయనగరం అర్బన్ : విజయనగరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఈ నెల 24 న (బుధవారం) నాడు నామినేషన్ వేస్తారని నియోజకవర్గ పార్టీ నాయకులు తెలిపారు. సోమవారం అశోక్ బంగ్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటలకు కోట జంక్షన్ నుండి భారీ ఊరేగింపుగా బయలుదేరి మూడులాంతర్లు, గంటస్తంభం, కన్యకాపరమేశ్వరి కోవెల మీదుగా పాత మహారాజ ఆసుపత్రి జంక్షన్ వరకు వెళ్లడం జరుగుతుందని, తదుపరి తహసీల్దార్ వారి కార్యాలయంలో 10.30 గంటలకు నామినేషన్ పత్రాలను సమర్పిస్తారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొని పండగ వాతావరణంలో విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు , జిల్లా పెద్దలు పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్ సానుభూతి పొందడం కోసం చవకబారు రాజకీయాలు చేస్తున్నారని, ప్రతిసారి ఎన్నికలలో ఇలాంటి డ్రామాలు చేయడం జగన్ అలవాటు అయిందని, వీటిని ప్రజలు నమ్మకపోగా అసహ్యించుకుంటున్నారని నాయకులు విమర్శించారు. ఇటువంటి డ్రామాలు ఎన్ని చేసిన కూటమి విజయాన్ని అడ్డుకోలేరని, ప్రజల నుండి మా నాయకులకు వస్తున్న ఆదరణ చూస్తుంటే రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమని అర్ధమవుతుందని తెలిపారు. విజయనగరం ఎమ్మెల్యేగా అదితి విజయలక్ష్మి గజపతి రాజు భారీ విజయం సాధిస్తారని తెలిపారు.