కమిషనర్ ఎం ఎం నాయుడు
విశాలాంధ్ర -విజయనగరం టౌన్ : నగరంలోని ప్రధాన కాలువలతో పాటు, చిన్న చిన్న కాలువలలో కూడా పూడికలు ఉండరాదని పారిశుధ్య సిబ్బందికి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం ఎం నాయుడు ఆదేశించారు. బుధవారం 49వ డివిజన్ కంటోన్మెంట్, కేఎల్ పురం ప్రాంతాలలో పారిశుద్ధ్య విధానం పట్ల క్షేత్రస్థాయి పర్యటన చేశారు. కంటోన్మెంట్ గణేష్ కోవెల సమీపంలో చాలా కాలంగా పూడిక పేరుకుపోవడంతో వర్షపు నీరు రహదారులపై ప్రవహిస్తుందని గమనించిన ఆయన బుధవారం అక్కడికి చేరుకొని పూడికలు తీయించే పనులను యుద్ధ ప్రాతిపదికన సిబ్బందితో చేపట్టారు. ఆయనే స్వయంగా పూడిక ఉన్న కాలువల వద్దకు సిబ్బందిని తీసుకువెళ్లి పరిస్థితిని చక్కదిద్దాలని సూచించారు. ఇంతకాలంగా కాలువల్లో పూడిక పేరుకుపోయినా తొలగించ లేదంటూ పారిశుద్ధ్య సిబ్బంది, కార్యదర్శి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వీధులలో పర్యటించి ఇంటింటి చెత్త సేకరణ విధానాన్ని గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కాలువల ద్వారా వర్షపునీరు ప్రవాహానికి అడ్డంకి లేకుండా చూడాలన్నారు. కాలువల్లో పేరుకుపోయిన పూడికను యుద్ద ప్రాతిపదికన తొలగించాలని సిబ్బందికి ఆదేశించామన్నారు. రహదారులపై కాలువనీరు ప్రవహించకుండా చూడాలని అందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం ప్రజారోగ్య విభాగం తయారుచేసిన వ్యర్ధపదార్థాలతో ఆకర్షణీయ పూల కుండీలను పరిశీలించారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో వాటిని ఏర్పాటు చేయడాన్ని చూసి, వాటిని రూపొందించిన ప్రజారోగ్య సిబ్బందిని అభినందించారు.