గుంటూరు : రాష్ట్ర విద్యా వ్యవస్థలో ‘ఎయిడెడ్’ విద్యా సంస్థల శకం ముగుస్తోంది. ఆ విద్యాసంస్థలను మూసివేసేందుకు కావాల్సిన అధికారాల కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనిలో భాగం గానే ఈ విద్యాసంస్థలకు అందించే సాయాన్ని నిలుపుదల చేసి, సిబ్బందిని వెనక్కు తీసుకోనుంది. దీంతో ఏళ్ల చరిత్ర కలిగిన ఎయిడెడ్ విద్యాసంస్థలు ఒక్కొక్కటిగా కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఏర్పడిరది. గత ప్రభుత్వాల విధానాలతో ఇప్పటికే ఎయిడెడ్ విద్యాసంస్థల ఉనికి నామమాత్రంగా మారిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆ సంస్థల ఆస్తులు, భవనాలు, మైదానాలు, ఇతర సదుపాయాలను తమకు స్వాధీనం చేస్తేనే ప్రభుత్వంలో విలీనం చేసుకుంటానని, లేనిపక్షంలో ఇక పూర్తిగా ప్రయివేటు ఆధ్వర్యంలోనే నడుపు కోవాలని ఇప్పటికే తేల్చి చెప్పింది.
తాజాగా జారీ చేసిన ఆర్డినెన్స్లో ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు, ప్రభుత్వ సిబ్బందిని కూడా వెనక్కి తీసుకోనున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయంతో ఆ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది. రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థల్లో 4.80 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 1972 పాఠశాలల్లో 1,97,291 మంది, 120 జూనియర్ కళాశాలల్లో 31 వేలు, 137 డిగ్రీ కళాశాలల్లో 2.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. గుంటూరు జిల్లాలో 328 ఎయిడెడ్ విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో 211 ప్రాథమిక, 31 ప్రాథమికోన్నత పాఠశాలలు , 81 ఉన్నత ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళా శాలలు, డిగ్రీ ఎయిడెడ్ కళాశాలలు, పట్టణ ప్రాంతాల్లో క్రైస్తవ మిషనరీ స్కూళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇందులో చాలా పాఠశాలలు దశాబ్ధాలుగా పేద, ధనిక విద్యార్థులనే తేడా లేకుండా విద్యనందిస్తున్నాయి. తొలుత జనవాసాలకు వెలుపల ఏర్పాటైన ఈ సంస్థలు కాలక్రమేణా పట్టణాలు, నగరాల విస్తీర్ణం పెరగ డంతో పట్టణాల మధ్యకు చేరుకున్నాయి. దీంతో వాటి విలువ కోట్లలో ఉన్నందున ఆస్తులను ప్రభు త్వానికి స్వాధీనం చేసేందుకు సుముఖంగా లేని ఎయిడెడ్ స్కూళ్ల వివరాలు కూడా విడిగా పంపిం చాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీటిలో చదువుతున్న విద్యార్ధులను ఎక్కడ చేర్చాలి, వాళ్ల పరిస్థితి ఏంటనే ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ఇప్ప టికే ఎయిడెడ్ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో అడ్మి షన్లను ప్రభుత్వం నిలిపేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో ఇకపై ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశా లలు మాత్రమే ఉండేలా ప్రభుత్వం కార్యచరణచేపట్టింది. ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వహణ లోపాలను చక్కదిద్ది, బలోపేతానికి చర్యలు తీసుకోకుండా ఆ సంస్థల యాజమాన్యాల నుంచి విలువైన ఆస్తులను లాక్కునేందుకు పావులు కదుపుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటిలో ప్రభుత్వ జీతాలతో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిని వెనక్కు తీసుకుని ప్రభుత్వ పాఠశాలలకు కేటాయిం చాలని సర్కారు యోచిస్తోంది. భూమి, భవనాలను స్వాధీనం చేయకుంటే ఇకపై వాటిని ప్రైవేట్ స్కూళ్లుగా నిర్వహించుకునేందుకు మాత్రమే అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. అక్కడ పనిచేసే టీచర్లకు ఇకపై మేనేజ్మెంట్లే జీతాలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది మాత్రం విలీనమైతే తమకు ఉద్యోగ భద్రతకు భరోసా ఉంటుందనే భిన్నమైన ఆలోచనల మధ్య ఎయిడెడ్ విద్యా సంస్థల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. మరోవైపు ఎయిడెడ్ పాఠశాల సిబ్బందిని ప్రభుత్వంలో కలపడం పట్ల నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలోని 1972 పాఠశాలల్లో పని చేస్తున్న సుమారు 11 వేల మంది ఉపాధ్యాయు లను ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయడం వల్ల భవిష్యత్తులో కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఉండవని నిరుద్యోగులు మదనపడుతున్నారు.