విశాలాంధ్ర – సీతానగరం : మండలకేంద్రం లోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలోగల శ్రీలక్ష్మినరసింహాస్వామి ఆలయంలో గురువారంనాడు మొదటి ఏకాదశి సందర్భంగా పెద్దఎత్తున భక్తులు విచ్చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారరు.తొలిఏకాదశిని సర్వపాపహారిగా పిలుస్తారని భక్తుల నమ్మకం.విష్ణుప్రీతికరమైన తొలి ఏకాదశినాడు ఉపవాసం, తీర్థక్షేత్రాల సందర్శనం చేస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకంతోపాటు అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఈఏకాదశి తరువాతనే దక్షిణాయనం ప్రారంభమవుతుందన్నారు.తొలి ఏకాదశితో కాలగమనమార్పు జరగడంతో ఈరోజునుంచి భూమిపై రాత్రిసమయాలు పెరుగుతాయన్నారు.వానాకాలంలో వచ్చే మొదటిఏకాదశి కనుక దీన్ని తొలి ఏకాదశిగా పిలుస్తారని పండితుల అభిప్రాయం.ఈతొలిఏకాదశినాడు ఉపవాస జాగారాలతో విష్ణువును పూజించడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయని నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించారు. జగన్నాథరథయాత్ర ముగిసిన మరుసటి రోజున వచ్చే తొలి ఏకాదశికు పురాణాల్లో, ఇతిహాసాల్లో ఎంతోవిశిష్టత ఉంటుందని చరిత్ర తెలియజేస్తుంది. నేటినుండి నాలుగునెలలు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటారనిపండితులు తెలిపారు. యోగనిద్ర లేచాక వచ్చే కార్తీక శుద్ధఏకాదశి, తరువాత భీష్మఏకాదశిలకు కూడా అంతే విశిష్టత ఉంటుందని తెలిపారు.గురువారం మండలంలోని అన్ని ఆలయాల్లో భక్తుల తాకిడి పెరిగి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
ముడుపులపూజలకు అనూహ్యస్పందన:
స్థానిక శ్రీలక్ష్మీనరసింహస్వామిఆలయంలో తొలి ఏకాదశి పర్వదినం, స్వామివారి స్వాతీనక్షత్రం సంధర్భంగా జరిగిన ముడుపుల పూజలకు అనూహ్య స్పందన లభించింది.ఆలయంలో తెల్లవారుజామున మూడు గంటలనుండి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారికి ఆలయఅర్చకులు పీసపాటిశ్రీనివాసాచార్యులు,రామానుజాచార్యులు పూజలను నిర్వహించారు. ప్రతీగురువారం శ్రీలక్ష్మి నరసింహస్వామీ దేవాలయంలో జరుగుతున్నముడుపుల పూజలకు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాలనుండి భక్తులు విచ్చేసి భక్తిశ్రద్ధలతో, ఉపవాసాలతో పూజలు చేస్తున్నారు. అన్ని వర్గాల వారు,మహిళలూ,పురుషులు, యువతీ యువకులు సైతం పెద్ద ఎత్తున ముడుపులు కట్టి ఉపవాసదీక్షను పాటిస్తూ పూజలు చేస్తున్నారు. అందరికీ శుభం కలుగుతుందని పలువురు భక్తులు తెలిపారు. ఉదయంనుంచి సాయంత్రం వరకు బ్యాచులవారీగా పూజలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. వారం వారం భక్తుల రద్దీి ఘననీయంగా పెరుగుతుంది. ఏకాదశి రోజున కొత్తగా 135మంది భక్తులు ముడుపులు కట్టి పూజలు ప్రారంభం చేయగా మొత్తం ఐదు వందలకు పైగా భక్తులు ముడుపులు పూజలో పాల్గొంటున్నట్లు అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. ప్రతీ గురువారం నిర్వహించే ముడుపుల పూజలకు తొమ్మిది వారాలపాటు భక్తులు హాజరై అనంతరం వారి ఇలవేల్పు ఆలయానికి వెళ్ళి ముడుపులు హుండీలో వేయడం వల్ల మంచి జరుగుతుందని పలువురు భక్తులు తెలిపారు. ఏదిఏమైనా శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంవల్ల గురువారం, శ్రీసువర్ణ ముఖేశ్వరస్వామి ఆలయం వల్ల సోమవారం, శ్రీఅభయాంజ నేయస్వామివల్ల మంగళవారం, శ్రీవేణు గోపాలస్వామివల్ల శనివారం మండలంలో భక్తులరద్దీ ఎక్కువగా ఉండటం గమనార్హం. కలియుగంలో అన్నివర్గాల ప్రజల్లో భక్తి భావం పెరుగుతూ ఆధ్యాత్మిక భావాలు పెరగడం వల్ల ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేస్తున్నారని అర్చకులు చెబుతున్నారు.