కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్విట్టర్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. కొన్ని ఖాతాలను నిలిపివేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ ట్విట్టర్ దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా సోషల్ మీడియా సంస్థ కోర్టును ఆశ్రయించిందని న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్ అన్నారు.ఇందుకు ట్విట్టర్ పై రూ. 50 లక్షలు విధించారు. 45 రోజుల్లోగా కర్ణాటక లీగల్ సెల్ సర్వీసెస్కు ఈ మొత్తం చెల్లించాలని కోర్టు ట్విట్టర్ను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎటువంటి వివరణను ట్విట్టర్ సంస్థ ఇవ్వలేదని న్యాయమూర్తి దీక్షిత్ తెలిపారు. తన తీర్పులో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సమర్ధించారు. ట్వీట్లను, అకౌంట్లను బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21 ప్రకారం భారత పౌరులకు లభించే భావప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను ఓ విదేశీ కంపెనీ అయిన ట్విట్టర్ క్లెయిమ్ చేయలేదని కోర్టు సూచించింది.