సీపీఐ అధ్వర్యాన పుట్టపర్తిలో భారీ ర్యాలీ, ధర్నా
విశాలాంధ్ర – పుట్టపర్తి: అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు, సాగు పట్టాలు ఇవ్వాలని డిమాండ్చేస్తూ సీపీఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన సోమవారం పుట్టపర్తిలో భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. గణేష్ సర్కిల్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాకు మహిళలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆర్డీవో కార్యాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అర్హులందరికీ నివేశ స్థలాలు, సాగు పట్టాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రామచంద్రయ్య, శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇళ్లు కాదు ఊర్లు నిర్మిస్తామని సీఎం జగన్ చెబితే సంతోష పడ్డామని, అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన ఎక్కడైనా ఒకటో వంతు ఇళ్లు నిర్మించారా అని ప్రశ్నించారు. జిల్లా వ్యాప్తంగా 62వేల ఇల్లు మంజూరయ్యాయనీ, అందులో 12000 వేలు ఇల్లు మాత్రం నిర్మాణం జరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా 32 మండలాలలో పేదల సాగు చేసుకుంటున్న సాగు భూములకు పట్టాలి ఇవ్వలేదని, అధికార పార్టీ నాయకుల అడుగుల మడుగులు వారికే పట్టాలిస్తున్నారన్నారు. కర్నాటక మద్యాన్ని ఇక్కడికి తరలించి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న పాలకులు ఇక్కడ ఇసుకను కర్నాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని తప్పుపట్టారు. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి నివేశస్థలాలు సాగు పట్టాలు ఇచ్చేవరకు సీపీఐ పేదలకు అండగా ఉండి వారి పక్షాన పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఆర్డీవో భాగ్యరేఖ ధర్నా దగ్గరకు చేరుకుని నిజమైన లబ్ధిదారులు అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నాయకులందరూ కలిసి కలెక్టర్ కార్యాలయం చేరుకొని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటమయ్య, సహాయ కార్యదర్శి కేశవరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు, గంగాధర్, జయలక్ష్మి, కుళ్లాయప్ప, శ్రీరాములు, మధు, మహదేవ్, శివప్ప, వినోద్ నాయకులు కుళ్లాయప్ప, ఈశ్వరమ్మ, లక్ష్మి, వెంకటనారాయణ, గౌస్లాజం తదితరులు పాల్గొన్నారు.