విశాలాంధ్ర,పార్వతీపురం : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాధాన్యత భవానాల నిర్మాణపనులను త్వరితగతిని పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వీరఘట్టంమండలం చిట్టిపూడివలసలో నిర్మాణంలో ఉన్న విలేజ్ హెల్త్ సెంటర్, రైతుభరోసాకేంద్రాన్ని, వండవగ్రామంలో నిర్మాణం పూర్తి కావస్తున్న గ్రామ సచివాలయాల భవన నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు.
ఈసందర్భంగా ఆయనమాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల మేలుకోరి గడప వద్దకే సేవలు అందించాలన్న దృక్పథంతో అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని నిర్మిస్తున్న భవనాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులకు నిధుల కొరత లేదని, జరిగిన మేరకు బిల్లుల చెల్లింపు జరుగుతుందని అన్నారు. సిమెంట్ కొరత లేదన్న పరిస్థితి రాకూడదని, అత్యవసర సమయంలో స్థానికంగా సిమెంట్ కొనుగోలు చేసి పనులు వేగవంతం చేయాలని సూచించారు. అవసరమైన నిర్మాణ సామగ్రిని ముందస్తుగా సిద్ధం చేసుకోనెలా చర్యలు తీసుకోవాలని పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి డి.కళ్యాణదుర్గను ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడంతోపాటు క్యూరింగ్ పనులపై శ్రద్ద చూపాలని స్పష్టం చేశారు. నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తి అయ్యేవిధంగా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలన్నారు.ఈకార్యక్రమంలో సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కల్పనాకుమారి, తహాశిల్దార్ సత్యనారాయణ, గ్రామసచివాలయం కార్యదర్శులు నల్ల శివ, మణికంఠ,భవానీ శంకర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.