కేరళ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇడుక్కి, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్.. తిరువనంతపురం సహా మరో 12 జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. కేరళ, కర్ణాటక తీర ప్రాంతాల్లో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. కన్నూర్, కాసర్గోడ్, ఎర్నాకులం, అలప్పుజా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. అత్యవసర ఆపరేషన్ సేవలు సిద్ధంగా ఉండాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు. ఇడుక్కి, మలప్పురం, అలప్పుజా, వాయనాడ్, కోజికోడ్, త్రిసూర్, పతనంతిట్ట జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. రెడ్ అలర్ట్ ఒక రోజులో 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం, ఆరెంజ్ అలర్ట్ 20 సెం.మీ వరకు వర్షపాతాన్ని సూచిస్తుంది. ఇడుక్కి, కన్నూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.ఇటు, కర్ణాటకలోనూ గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాలను వరద ముంచెత్తింది. మరో ఐదు రోజుల పాటు కేరళ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికలతో దక్షిణ కన్నడ ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని ప్రజలకు సూచించారు.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.