ఎల్ నినోపై ప్రపంచ వాతావరణ సంస్థ కీలక ప్రకటన
పెరగనున్న ఉష్ణోగ్రతలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వల్ల వర్షాలు అన్ని ప్రాంతాల్లో ఒకేలా కురవడం లేదు. ఒక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుంటే, మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు కాస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఎల్ నినో ప్రభావమే అని నిపుణులు అంటున్నారు. ప్రధానంగా దక్షిణ, మధ్య, తూర్పు భారతంలో అనేక ప్రాంతాలు వర్షాభావం నెలకొంది. రిజర్వాయర్లలో నిల్వలు ఆందోళనకర స్థాయికి పడిపోవడంతో ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్ నినో ఏర్పడినట్టు ప్రపంచ వాతావరణ సంస్థ ధ్రువీకరించింది. దీని తీవ్రత ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచి దీని పెరుగుతుందని, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదై, సముద్రంలో విపరీతమైన వేడి ఉత్పన్నమవుతుందని హెచ్చరించింది. ప్రతి రెండు నుంచి ఏడు సంవత్సరాలకు ఒకసారి ఎల్ నినో వస్తుంది. దీని వల్ల సముద్ర సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలతో పాటుగా వడగాల్పులు, కరువు వంటి తీవ్రమైన వాతావరణ సంఘటనల చోటుచేసుకుంటాయి. ఎల్ నినో సాధారణ దశ కంటే వేడిగా ఉంటుంది. ఈ సమయంలో నినో 3.4 అని పిలిచే భూమధ్యరేఖ.. పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సగటు కంటే 0.5 డిగ్రీల సెల్సియస్ వేడెక్కుతాయి. ఈ ఉష్ణోగ్రత విలువను ఓషన్ నినో ఇండెక్స్ అని కూడా పిలుస్తారు. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకారం ఇది జూన్ మధ్యలో 0.9ళీజ వద్ద ఉంది. గత కొన్ని నెలలుగా సముద్ర ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. ఫిబ్రవరి నాటికి -0.44 డిగ్రీలుగా ఉండగా మే నెలకు ం0.47 డిగ్రీల సెల్సియస్కు చేరుకుని, జూన్ మధ్యకి 0.9 డిగ్రీలకు చేరినట్టు వివరించింది.
ఎల్ నినో ప్రభావం
ఇక, గతంలో సంభవించిన ఎల్ నినోల చరిత్ర పరిశీలిస్తే… తీవ్రత తొమ్మిది నెలల నుంచి ఏడాది వరకూ ఉంటుంది. మధ్య, తూర్పు పసిఫిక్ మహా సముద్రంలో 2016లో బలమైన ఎల్నినో ఏర్పడింది. ఇది ఏర్పడిన తర్వాతి సంవత్సరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అందువల్ల వచ్చే ఏడాది ఎండలు మరింత తీవ్రంగా ఉండి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.ఎల్ నినో వల్ల ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా భారత్ సహా దక్షిణాసియాలోని పలు భాగాలు, ఇండోనేషియా, ఆఫ్రికా, మధ్య అమెరికా, ఉత్తర దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియాల్లో తీవ్రమైన కరువు ఛాయలు ఏర్పడతాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఇదే సమయంలో దక్షిణ అమెరికాలోని దక్షిణ ప్రాంతం, మధ్య ఆసియా, ఆఫ్రికా హర్న్లో వర్షపాతం పెరుగుతుందని పేర్కొంది. ఎల్ నినో మధ్య, తూర్పు పసిఫిక్లో మరిన్ని తుఫాన్లకు ఆజ్యం పోస్తుంది. అట్లాంటిక్ మహాసముద్రంలో హరికేన్లు ఏర్పడటాన్ని అణిచివేస్తుందని, అందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించింది.
భారత్లో ఖరీఫ్ సీజన్కు దెబ్బ
మరోవైపు, దేశంలో ఖరీఫ్ సీజన్పై ఎల్ నినో తీవ్ర నష్టం కలిగిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నైరుతి సీజన్ ప్రారంభం నెల జూన్లో తీవ్రమైన ఎండలు, వర్షాభావంతో దేశం అల్లాడిపోయిందని, ఖరీఫ్ పనులపై ప్రభావం పడిందని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ప్రస్తుతం కేరళ, దక్షిణ కర్ణాటకకు ఆనుకుని పశ్చిమ కనుమల్లో వర్షాలు కురుస్తున్నా.. కృష్ణా, గోదావరి బేసిన్లలో పరిస్థితి నిరాశాజనకంగా ఉందని పేర్కొన్నారు. జులై, ఆగస్టు నెలల్లో వర్షాలు కొంత మేర ఫర్వాలేదు గానీ సెప్టెంబరులో మాత్రం వర్షాభావం నెలకొంటుందని అంచనా వేశారు.