కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలకు తుంగభద్ర జలాశయానికి వరద రాక మొదలయింది. ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా కురుస్తున్న వానలకు తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరుకోవడంతో శనివారం వరద నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో సోమవారం టీబీ డ్యాంలోకి వరద నీటి చేరిక ప్రారంభమైంది. తుంగ, భద్ర ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాల నుంచి వరద భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తుంగభద్ర బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలోకి 17,061 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, అవుట్ ఫ్లో 255 క్యూసెక్కులు నమోదైంది. నీటి నిల్వ 3.911 ఉన్నట్లు డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు. టీబీ డ్యాంకు వరద రాక ప్రారంభం కావడంతో తెలంగాణ, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూడు రాష్ట్రాల రైతులకు వరప్రదాయనిగా ఉన్న టీబీ డ్యాం మీదే తుంగభద్ర నదీతీర ప్రాంతాల ప్రజలు, రైతులు ఆధారపడి ఉన్నారు.