. సెప్టెంబరు 6న తిరుపతిలో బహిరంగ సభ
. ప్రజాచైతన్యమే సీపీఐ ప్రధాన లక్ష్యం
. అప్పుల ఊబిలో రాష్ట్రం
. ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ కుట్రలు
. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల, జేవీ సత్యనారాయణమూర్తి
విశాలాంధ్ర - విజయవాడ: ‘రాష్ట్రాన్ని రక్షించండి
దేశాన్ని కాపాడండి’ నినాదంతో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ అధ్వర్యంలో ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 6వ తేదీ వరకు 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి తెలిపారు. విజయవాడ దాసరి భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ బస్సుయాత్ర 32 మంది అమరవీరుల రక్తతర్పణతో సాధించుకున్న విశాఖ స్టీల్ప్లాంట్ మెయిన్ గేటు (కూర్మన్నపాలెం) నుంచి ప్రారంభమై శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం మీదుగా 26 జిల్లాలలో సాగి… సెప్టెంబరు 6న తిరుపతిలో భారీ బహిరంగ సభతో ముగుస్తుందన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందని ముప్పాళ్ల చెప్పారు. రాజధాని నిర్మాణం, పరిశ్రమలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రజల పక్షాన నిలబడి సీపీఐ పోరాడుతోందన్నారు. ప్రజాచైతన్యం ద్వారా ఈ ప్రభుత్వ దుర్మార్గ విధానాలను తిప్పికొట్టడమే బస్సుయాత్ర ప్రధాన ఉద్ధేశమని వివరించారు. దేశంలో ప్రజల మధ్య చీలిక తెచ్చి…మత విద్వేషాలు రెచ్చగొట్టి కార్పొరేట్ శక్తుల సహాయంతో 2024 ఎన్నికల్లో గెలవాలనే తాపత్రయంతో బీజేపీ ముందుకు సాగుతోందని విమర్శించారు. విశాఖ స్టీల్ప్లాంట్ మొదలుకొని లాభాలలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ, అమిత్ షా ద్వయం కారుచౌకగా అమ్ముతోందని, ‘మేమిద్దరం..మాకు ఇద్దరు’ అన్నట్లు అంబానీ, అదానీకి దోచిపెడుతున్నదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీని అధికారం నుంచి దించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడిరదన్నారు. రాష్ట్రం అధోగతి పాలవుతోందని, ఆర్థికంగా దివాలా అంచుకు నెట్టబడిరదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం అప్పు ఇవ్వకపోతే ఒక్క నెల జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. మరోవైపు భరించలేనంత విద్యుత్ భారాలు, ఖాళీ స్థలాల పన్ను, చెత్తపన్ను, నీటి పన్ను, విద్యుత్ మీటర్లతో పాటు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో రాష్ట్రంలోనూ, దేశంలోనూ ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆరోపించారు. పెరిగిన ధరలతో కుటుంబ బడ్జెట్ తలకిందలై ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, పోలవరం ప్రాజెక్టుపై రూ.12,900 కోట్లకు మించి ఒక్క రూపాయి ఇవ్వనని తేల్చి చెప్పినా మోదీని నిలదీసే దమ్ము ముఖ్యమంత్రికి లేకుండా పోయిందన్నారు. పోలవరానికి సంబంధించి మరో 35 వేల కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఎగ్గొట్టే పరిస్థితి ఉందన్నారు. మొత్తం 31 మంది ఎంపీలు ఉన్నా రాష్ట్ర హక్కుల కోసం దేబిరించడం తప్ప డిమాండ్ చేసే పరిస్థితి జగన్ లేదన్నారు. ఆయనను భయం వెంటాడుతోందని, ఏ క్షణంలో బెయిల్ రద్దు అవుతుందో, ఏ క్షణం బాబాయి కేసు తీవ్రతరమవుతుందో అర్థంగాని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. రాష్ట్రంలో నాలుగేళ్ల రెండు నెలల తరువాత కూడా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా బటన్ నొక్కుడు తప్ప మరొకటి చేయలేదన్నారు. ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో యువతలో తీవ్రమైన నిరాశ నిస్పృహలు చొటుచేసుకుంటున్న నేపథ్యంలో సీపీఐ బస్సుయాత్ర చేపట్టిందన్నారు. యాత్రలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శులు, కార్యదర్శివర్గ సభ్యులు, ప్రజాసంఘాల అధ్యక్ష, కార్యదర్శులు 22 రోజుల పాటు పాల్గొంటారన్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కార్యదర్శులు కె.నారాయణ, వినయ్విశ్వం తదితర జాతీయ నేతలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ యాత్రకు మీడియా సహకారం కావాలని కోరారు.
జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మోదీ 9ఏళ్ల పాలనలో ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప చేసిందేమీ లేదన్నారు. ‘సబ్ కా సాత్సబ్ కా వికాస్’ అంటే అంబానీ, అదానీ అభివృద్ధి మాత్రమేనన్నారు. ‘బేటీ బచావో
బేటీ పడావో’ నినాదమిచ్చిన మోదీ సర్కారు…అంతర్జాతీయస్థాయిలో పేరుప్రఖ్యాతలు తెచ్చిన మహిళా రెజ్లర్లపై బీజేపీ ఎంపీ లైగింక దాడి చేసినట్లు చెప్పినా అతనిని అరెస్టు చేయటానికి చేతులు రాలేదన్నారు. చివరికి సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చిందన్నారు. జీఎస్టీ వంటి అనేక అంశాలను గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యతిరేకించిన మోదీ…ప్రధానిగా నియంతృత్వంతో అమలు చేస్తున్నారని సత్యనారాయణమూర్తి విమర్శించారు. అన్ని వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకొని…ప్రత్యర్థులపై కక్షసాధింపునకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. గవర్నర్ల వ్యవస్థను భ్రష్టు పటిస్తున్నారని చెబుతూ…తమిళనాడు, తెలంగాణ గవర్నర్లు, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పాత్రపై నోరువిప్పటం లేదన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పే కేంద్రం… మణిపూర్ ప్రజల్ని కాపాడలేకపోతోందన్నారు. 2024 ఎన్నికల్లో గెలవటానికి ఎన్డీఏ పునర్వ్యవస్థీకరణకు బీజేపీ తాపత్రయ పడుతోందని విమర్శించారు. మోదీ సర్కారుకు గెలుపు భయం పట్టుకుందని, అందుకే రాజ్యాంగాన్ని సైతం పక్కనపెట్టి ఉమ్మడి పౌరస్పృతి నాటకమాడుతోందని మండిపడ్డారు. యూసీసీ అమలుకు లా కమిషన్ నివేదిక సరిపోదని, ప్రజల ముందు చర్చకు పెట్టాలని డిమాండ్ చేశారు. అనేకసార్లు దిల్లీ వెళ్లిన సీఎం జగన్ సాధించింటి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మాఫియా పాలిస్తుందంటూ విశాఖపట్నం పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిరచారు. కేంద్రం చేతిలో ఉన్న ఈడీ, సీబీఐ ఏమి చేస్తున్నాయని నిలదీశారు. ఏపీ ఆర్థిక అంశాలకు సంబంధించి కేంద్రం అనుమతులు ఇస్తున్నదని, అప్పుల భారం ప్రజలపై పడుతుందని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి జగన్కు ప్రత్యక్ష సహకారం ఉందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలను ఓడిరచటమే లక్ష్యంగా బస్సుయాత్ర చేపట్టినట్లు వివరించారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ కోటేశ్వరరావు, దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.