విశాలాంధ్ర -రాప్తాడు : ఏపీ సాఫ్ట్ బాల్ క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై సత్తా చూపి దేశఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి ఆకాంక్షించారు. అంతర్జాతీయ పోటీలలో వివిధ కేటగిరీలలో ప్రతిభ చూపిన సాఫ్ట్ బాల్ క్రీడాకారులకు మంగళవారం విజయవాడలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వీసీ అండ్ ఎండీ హర్షవర్ధన్, సాఫ్ట్ బాల్ ఏపీ సీఈఓ సి.వెంకటేసులు హాజరయ్యారు. బైరెడ్డి సిద్దార్థరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సాఫ్ట్బాల్ క్రీడ దినదినాభివృద్ధి చెందుతోందని, పలు టోర్నమెంట్లలో జాతీయస్థాయిలో అనేక పతకాలు సాధించడం హర్షణీయమన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఉత్తమ ప్రతిభ చాటిన క్రీడాకారులకు ప్రోత్సాహక బహుమతులు సైతం అందిస్తోందన్నారు. క్రీడా సౌకర్యాలు, ప్రోత్సాహకాలు కల్పించడంలో దేశంలోనే ఏపీ ప్రభుత్వం ముందు వరుసలో ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో దాగివున్న నైపుణ్యమైన క్రీడాకారులను వెలికి తీయాలనే ఉద్దేశంతో అక్టోబర్ 2వ తేదీ నుండి ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఒక గొప్ప కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఇటీవలి కాలంలో సాఫ్ట్బాల్ క్రీడా పోటీలలో ఏపీ క్రీడాకారులు విశేషంగా రాణిస్తున్నారన్నారు. వారి ఎదుగుదలకు కృషిచేసిన అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు. అనంతరం జపాన్ దేశంలోని కోచిలో జరిగిన ఏషియన్ చాంపియన్షిప్ మెన్ పోటీలలో పాల్గొన్న గుంటూరుకు చెందిన షేక్ చిన్న మస్తాన్ బాబా, రాంబాబు, శబరినాథ్, అనంతపురం జిల్లా శివకుమార్, సౌత్ కొరియాలోని తక్కాయ్ లో జరిగిన ఏషియన్ చాంపియన్షిప్ ఉమెన్ పోటీలలో పాల్గొన్న కృష్ణా జిల్లా శాన్విత, జపాన్ లోని అండర్- 18 ఏషియన్ చాంపియన్షిప్ బాయ్స్ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు కర్నూలు గౌతమ్ రాజు, అనంతపురం లక్ష్మీకల్యాణ్, తైవాన్ దేశంలోని అండర్-15 ఏషియన్ ఛాంపియన్షిప్ గర్ల్స్ పోటీలలో పాల్గొన్న కొండూరు స్మైలీ, ముక్తాపురం కీర్తనలకు శాప్ ఆధ్వర్యంలో శాలువా, క్రీడా దుస్తులు, మెమెంటోతో ఘనంగా సత్కరించారు. మున్ముందు ఇదే స్ఫూర్తితో రాణించి గొప్ప క్రీడాకారులు కావాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు సాంబశివరావు, సుబ్బారావు, బద్రి తదితరులు పాల్గొన్నారు.