అంగన్వాడీలకు గుడ్లు సరఫరా లో కాంట్రాక్టర్ మాయ
విశాలాంధ్ర – పెనుమంట్ర : రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అంగన్వాడీల ద్వారా విస్తృతమైన సేవలు అందిస్తుంది. గర్భిణీలు ,బాలింతలు, చిన్నారులకు బలమైన పౌష్టికాలను అందించాలన్న లక్ష్యంతో అంగన్వాడి ల ద్వారా కోడిగుడ్లను పంపిణీ చేస్తుంది. పౌష్టిక ఆహార పంపిణీలో భాగంగా ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటుంది. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకున్న లబ్ధిదారులకు నెలకు 25 గుడ్లు ఇవ్వాల్సి ఉంది. బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు వారంలో 6 రోజులపాటు నిత్యం గుడ్లు అంగన్వాడీల ద్వారా అందించాలి అయితే అంగన్వాడీలకు సరఫరా చేస్తున్న గుడ్లలో మాయాజాలం సాగుతోంది. గుడ్లు సరఫరాను చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లు నిబంధనలకు త్రిలోదకాలు ఇస్తూ చిన్న పరిమాణంలో సరఫరా చేస్తూ ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున గ్రామాల్లో వినిపిస్తున్నాయి. కనీస బరువు కచ్చితంగా 50 గ్రాములు పైనే ఉండాలి. అయితే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలకు సరఫరా చేస్తున్న గుడ్లు 22 గ్రాముల నుండి 36 గ్రాములు లోపే ఉంటున్నాయి. బహిరంగ మార్కెట్లో లభించే గుడ్ల బరువుకు అంగన్వాడీలకు సరఫరా అవుతున్న వాటికి భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో గుడ్డు ధర కొండెక్కింది దీన్ని అనువుగా చేసుకుని కాంట్రాక్టర్లు పెద్ద సైజు గుడ్లను బహిరంగ మార్కెట్ కు తరలిస్తూ నాణ్యతలేని చిన్న పరిమాణంలో ఉన్న గుడ్లను (మూడవ కేటగిరికి చెందిన) అంగన్వాడిలకు సరఫరా చేస్తున్నట్లు లబ్ధిదారులు పేర్కొంటున్నారు. బహిరంగ మార్కెట్లో గుడ్డు బరువు 60 నుంచి 75 గ్రాముల వరకు ఉండగా అంగన్వాడీలకు సరఫరా అవుతున్న వాటి బరువు మాత్రం 22 గ్రాములు నుండి 36 గ్రాములు లోపే ఉండడం ఈ మాయా జలాన్ని స్పష్టం చేస్తుంది. ప్రతి ప్రాజెక్టులో ప్రతినెల సుమారు 3లక్షల గుడ్లు కు ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ నాణ్యతలేని గుడ్లు సరఫరా కావడం శోచనీయం. జిల్లా అంతా ఓకే కాంట్రాక్టర్ కావడంతో జిల్లాలో ప్రతి ప్రాజెక్టు పరిధిలో ప్రతి నెల లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును కాంట్రాక్టర్లు కొట్టేస్తున్నారు. కాంట్రాక్టర్లకు క్రమం తప్పకుండా బిల్లు చెల్లింపులు కూడా ప్రభుత్వం చేస్తుంది. నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ నిర్దేశ ధరలకు అనుగుణంగా ప్రస్తుతం రూ.4 .50 పైసలు ఇంచుమించుగా చెల్లింపులు జరుగుతోంది. అంగన్వాడీలో లబ్ధిదారులకు ప్రస్తుతం గుడ్లు సక్రమంగానే పంపిణీ అవుతున్న పరిమాణం మాత్రం చాలా చిన్నగా ఉండడంతో లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు.
గుడ్ల సరఫరాలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడంలో అధికార యంత్రాంగం ఉదాసీనతను ప్రదర్శిస్తున్నట్లుగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే చిన్న పరిమాణంలో గుడ్ల సరఫరా జరుగుతుందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేసే గుడ్ల ట్రే బరువు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా లేకున్నా వర్కర్లు, కాంట్రాక్టర్ నుంచి తీసుకున్నారని చెబుతున్నారు. ఇంత జరుగుతున్న అంగన్వాడి కేంద్రాల్లో ఉన్న లోపాలు సిడిపివోలు, అంగన్వాడి సూపర్వైజర్లు గుర్తించక లేకపోవడానికి కారణం ఏమిటి? అని సాధారణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గుడ్ల సరఫరా అంశంపై దృష్టి సారించాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.