విశాలాంధ్ర – కర్నూలు సిటీ : ఏకాగ్రతను పెంచుకోవడానికి విలువిద్య ఒక అద్భుతమైన మార్గమని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు.
కర్నూలు నగరంలోని శంకరాస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఆయన జిల్లా స్థాయి విలువిద్య ఎంపిక పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సంప్రదాయ క్రీడ అయినా విలువిద్యలో సాధన చేయడం వల్ల విద్యార్థులు మానసిక, శారీరక, ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఏకాగ్రత పెరిగి చదువులోనూ రాణిస్తారన్నారు. ఆడపిల్లలు విలువిద్యలో సాధన చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. క్రీడలతోపాటు అన్ని రంగాలలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మహిళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వివరించారు.మహిళా సాధికారతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. సమాజంలో మహిళలు వివక్షత గురవుతున్నారని ,ఆ పరిస్థితిని తప్పించాలంటే మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని చెప్పారు.ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల మాయాజాలంలో చాలామంది వ్యాయామానికి దూరమై ఒబెసిటి,బీపీ,షుగర్ వంటి సమస్యలతో బాధపడుతు న్నారని చెప్పారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు గెలుపు ఓటమి గురించి కాకుండా తమ దేహదారుడాన్ని మెరుగుపరచుకోవడంతోపాటు ఏకాగ్రతను పెంపొందించుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తించాలన్నారు.