విశాలాంధ్ర – కళ్యాణదుర్గం : అనంతపురం జిల్లా కంబదూరు మండలం పి.వెంకటం పల్లి లో నాలుగు నెలల కిందట తప్పిపోయిన ఓ యువకుడి శరీర భాగాల ఆనవాళ్లు గురువారం బయటపడటంతో పలు అనుమానాలకు దారితీస్తోంది.
పదో తరగతి ఫెయిల్ ఐన చరణ్ ఇంటి వద్దే ఉంటున్నాడు. 2023 ఏప్రిల్ 25న ఇంటి నుంచి పరారైన చరణ్ తిరిగి రాలేదు. అప్పట్లో కంబదూరు మిస్సింగ్ కేసు గా నమోదయింది. కుటుంబ సభ్యులు కూడా బంధువుల ఇళ్లల్లో వెతికారు. జాడ తెలియలేదు. గురువారం ఉదయం ఊరి శివారులలోని పొలాల్లో చెట్టుకు ఉరివేసుకున్నట్లుగా వేలాడుతూ కనిపించిన చరణ్ ని గుర్తించారు. గ్రామంలో ఎవరైనా తప్పిపోయారా అని ఆలోచన చేసిన స్థానికులు చరణ్ తల్లిదండ్రులు గోవిందు నాగరత్నలకు తెలిపారు . వారు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు . తమ కుమారుడు చరణ్ వేసుకున్న బట్టలు గుర్తించారు. అతని జేబిలో సెల్ఫోన్ కూడా ఉండటంతో నిర్ధారించుకున్నారు. కంబదూరు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలను సేకరించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు. తమ కుమారుడిని ఎవరో నమ్మబలికి ఊరి చివరకు తీసుకెళ్లి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు చరణ్ తండ్రి గోవిందు ఆరోపించారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలని చరణ్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.