ఒకవైపు భారీ వర్షాలు దేశ్యవ్యాప్తంగా దంచికొడుతుంటే.. మరోవైపు భూకంపాలు దడ పుట్టిస్తున్నాయి. ఉత్తరాదిలో కేవలం అరగంట వ్యవధిలోనే మూడు భూకంపాలు సంభవించడం గమనార్హం. రాజస్థాన్ రాజధాని జైపూర్లో శుక్రవారం తెల్లవారుజామున మూడు భూకంపాలు సంభవించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే మూడుసార్లు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మొదటి భూకంపం రిక్టర్ స్కేల్పై 4.4 తీవ్రతతో ఉదయం 4:09:38 గంటలకు సంభవించింది. తర్వాత మరో 13 నిమిషాల్లోనే రెండో భూకంపం.. 04:22:57 గంటలకు సంభవించగా.. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైంది. మూడోది 3.4 తీవ్రతతో 4.25:33 గంటలకు నమోదయినట్టు పేర్కొంది. మొదటి భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులోనూ.. తర్వాత రెండు భూకంప కేంద్రాలు 5 కి.మీ.లోతులో ఉన్నట్టు నేషనల్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో జైపూర్ నగరవాసులు భయంతో వణికిపోయారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, భూకంప ప్రకంపనల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకూ తెలియరాలేదు. మరోవైపు, ఉత్తరాదితో పాటు మధ్య భారత్, దక్షిణాదిలోనూ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు ఓ గ్రామంపై కొండచరియలు విరిగిపడి 16 మంది చనిపోయారు.