బ్యాంకింగ్ రంగ వెన్ను విరిచిన యూపీఏ
ప్రధాని మోదీ విమర్శలు
న్యూదిల్లీ: యూపీఏ హయాంలో బ్యాంకింగ్ రంగ వెన్ను విరిగిందని, ఎన్పీయేలు మిగిల్చిన నష్టాన్ని భర్తీ చేయలేని స్థితికి చేర్చిందని ప్రధాని మోదీ విమర్శించారు. గాంధీ కుటుంబానికి సన్నిహితులైన రాజకీయ నాయకులు కొందరు తమకు నచ్చిన వారికి కొన్ని వేల కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులకు ఫోన్ చేసి ఇప్పించారని, అవి తిరిగి చెల్లించేవి కావన్నారు. గత ప్రభుత్వ హయాంలో అతిపెద్ద కుంభకోణంగా ‘ఫోన్ బ్యాంకింగ్’ అని, బ్యాంకింగ్ రంగ వెన్నుముకను అది విరిచిందని మోదీ విమర్శించారు. ఫోన్ బ్యాంకింగ్కు తొమ్మిదేళ్ల కిందట వేరే అర్థం ఉండేదని, అది సాధారణ ప్రజలకు ఉద్దేశించినది కాదన్నారు. వర్చువల్గా 70వేల మందికి నియామక పత్రాలను అందించిన రోజ్గార్ మేళలో మోదీ మాట్లాడుతూ గాంధీ కుటుంబంపై, కాంగ్రస్ పాలనపై విమర్శలు గుప్పించారు. ‘2004`14 వరకు యూపీఏ అధికారంలో ఉంది. అప్పట్లో ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ వేలకోట్ల రూపాయల ఎన్పీయేలతో నష్టపోయాయి. ప్రస్తుతం అవి లాభాలబాటలో పయనిస్తున్నాయి’ అని ప్రధాని అన్నారు. తామొచ్చిన తర్వాత బ్యాంకింగ్ రంగం పుంజుకోగలిగిందని, పటిష్ఠ బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్న దేశాల సరసన భారత్ నిలిచిందని మోదీ తెలిపారు. చిన్న బ్యాంకుల విలీనం, దివాళా చట్టం, బ్యాంకులకు ఎన్పీయేల నుంచి రక్షణ కల్పన వంటి తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో బ్యాంకింగ్ రంగం పురోగతి సాధించగలిగిందని చెప్పారు. రూ.5లక్షల వరకు డిపాజిట్లకు హామీనివ్వడం ద్వారా 99శాతం బ్యాంకు ఖాతాదారులకు భద్రత కల్పించామన్నారు. ‘జులై 22వ తేదీ చరిత్రాత్మకమైన రోజు… మన జాతీయ పతాకాన్ని ప్రస్తుత రూపంలో 1947లో రాజ్యాంగ సభ అంగీకరించిన రోజు’ అని మోదీ అన్నారు. వచ్చే 25 ఏళ్లలో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలని ప్రజలు సంకల్పించారని చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో 10వ స్థానం నుంచి ఐదో స్థానానికి భారత్ ఎగబాకిందని, మరికొన్నేళ్లలో మూడోస్థానానికి ఎదుగుతుందని ఆకాంక్షించారు. ప్రతి రంగంలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, ప్రజల ఆదాయంలో వృద్ధి నమోదవుతుందని తెలిపారు. యువతకు నైపుణ్యాభివృద్ధిపై తమ ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించిందని, దారిద్య్ర రేఖ దిగువనున్న 13కోట్ల మందికి ఐదేళ్లలో మెరుగైన జీవితాన్ని కల్పించిందని మోదీ వెల్లడిరచారు.