పీజే చంద్రశేఖర్ పిలుపు
విశాలాంధ్ర`ఒంగోలు: హక్కుల సాధనకు గిరిజనులందరూ ఐక్యమవుదామని మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర నాయకులు పీజే చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో ఆదివారం ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సమాఖ్య (ఏపీజీఎస్) ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఏపీజీఎస్ జిల్లా కన్వీనర్ దాసరి నాగరాజు అధ్యక్షతన జరిగిన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన పీజే చంద్రశేఖర్ మాట్లాడుతూ అణగారిన గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు ఈ నెల 30,31 తేదీల్లో రాయచోటిలో నిర్వహించే ఏపీజీ ఎస్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. పాలకులు ఇప్పటివరకు గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప వారి సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి ఎక్కడా తోడ్పాటు నిచ్చిన దాఖలాలు లేవు అన్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు ద్వారా గిరిజనులకు రావలసిన రాయితీలు అందటం లేదన్నారు. మైదాన ప్రాంత గిరిజనులు అటవీ ప్రాంత గిరిజనులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. పోలీ సులు నుంచే కాకుండా పెత్తందారీ వర్గాల నుంచి దాడులు వేధింపులు పెరుగుతున్నా వాటిని అదుపు చేసే నాధుడే కరువయ్యారన్నారు. గిరిజనుల రక్షణ కోసం అనేక చట్టాలు పొందినా అవి అమలుకు నోచుకోవడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చి గిరిజనులను మరింత అణగారిన వర్గాలుగా చూస్తూ మరింత చిన్న చూపు చూస్తున్నదన్నారు. భారత రాజ్యాంగం గిరిజనుల కోసం అనేక హక్కులు కల్పించిందని,అనేక చట్టాలను రూపొం దించిందని తెలిపారు.అయితే వాటి అమలుకు ప్రతి గిరిజనుడు ఐక్యమై పోరాడాలని పీజే చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సమాఖ్య జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కన్వీనర్లుగా దాసరి నాగరాజు, ఆర్ శేషారత్నం, సిహెచ్ అశోక్ మరో 15 మందితో నూతన కమిటీ ఎన్నికైంది.