రాష్ట్ర కార్యదర్శి.. టి. ఆంజనేయులు
విశాలాంధ్ర -ధర్మవరం : రజకుల సమస్యల పరిష్కారం కొరకు ఆగస్ట్ 13 ఆదివారం ఉదయం 11 గంటలకు పుట్టపర్తి లోని శ్రీ సాయి ఆరామంలో నిర్వహించబడే, ఏపీ రాష్ట్ర రజక సంఘం ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శి టి. ఆంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాపనపల్లి శివప్ప, ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు పి .కృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జరగబోవు మహాసభను వేదికగా చేసుకొని, ఉద్యమ కార్యచరణ రూపొందించినట్లు వారు తెలిపారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, 50 సంవత్సరాలు నిండిన రజకులకు పెన్షన్ ఇవ్వాలని, పట్టణ ప్రాంతంలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు, రజక కమ్యూనిటీ హాల్ను కూడా నిర్మించాలని వారు తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో ప్రతి రజక కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇవ్వాలని, రజకులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని, దోబీగాట్లకు, లాండ్రీ షాపులకు ఉచిత కరెంటును ఇవ్వాలని తెలిపారు. రజకులపై జరుగుతున్న దాడులను పూర్తిగా నివారించాలని, అందుకోసమే రజకులను ఎస్సీ జాబితాలో చేరిస్తే, మాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అమలవుతుందని తెలిపారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినప్పటికీ రజకులకు న్యాయం జరగటం లేదని తెలిపారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని సంవత్సరాల తరబడి ఉద్యమాలు చేస్తున్న, ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణం అన్నారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉండగా అందులో 17 రాష్ట్రాలు ఎస్సీలుగా ఉన్నాయన్న విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలని తెలిపారు. రజకుల బ్రతుకులు మారుస్తామని ప్రభుత్వాలు అనేక జీవోలు విడుదల చేసిన అవి అమలుకు నోచుకోలేకపోవడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు రామచంద్ర, జిల్లా కన్వీనర్లు శ్రీనివాసులు, సంఘాల ఆనంద్, ధర్మవరం రజక సంఘం నాయకులు ప్రసాద్, రాధాకృష్ణ, నరేంద్ర, మాల్యవంతం నారాయణస్వామి, మల్లేనిపల్లి మహేష్, గంగరాజు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.