. పొంగుతున్న వాగులు, వంకలు
. కృష్ణానదికి భారీగా వరద
. మొత్తం 70 గేట్లు ఎత్తివేత
. 1.20 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి…
. గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక
. ఎడతెరపిలేని వర్షంతో ప్రజల ఇక్కట్లు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడికక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అటు గోదావరితో పాటు, ఇటు కృష్ణానది కూడా పరవళ్లు తొక్కుతోంది. గోదావరి నదికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ కాగా, కృష్ణా నదికి వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. మునేరు, కట్టలేరుతోపాటు చిన్నపాటి వాగులన్నీ పొంగి ప్రవహిస్తుండటంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద మొత్తం 70 గేట్లు ఎత్తేశారు. సుమారు లక్షా 20వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఈ సీజన్లో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు నీరు విడుదల చేయడం ఇదే మొదటిసారి. ఇక వరద ఉధృతి కారణంగా ముందు జాగ్రత్త చర్యగా కృష్ణాజిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. హంసలదీవి బీచ్ గేట్లు మూసేశారు. పర్యాటకుల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. పట్టణ రహదారులన్నీ చెరువులయ్యాయి. విజయవాడలో బస్టాండ్ లోబ్రిడ్జి, ఒన్టౌన్లో బ్రిడ్జి సమీపంలో భారీగా నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్థంభించడంతో వాహనదారుల ఇక్కట్లు వర్ణనాతీతం. ముంపు ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 23 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వేలేరుపాడు నుండి కోయిదా వెళ్లే ప్రధాన రహదారి వరద ముంపునకు గురై పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. బుట్టాయిగూడెం మండలంలో కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. జల్లేరు, బైనేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గిరిజనులు భయాందోళనలో ఉన్నారు. కామవరపుకోట మండలం కళ్లచెరువు, లింగపాలెం మండలం ఆసన్నగూడెం గ్రామాలను కలిపే గుండేరువాగు కొట్టుకుపోయింది. వారికున్న ఏకైక మార్గం కూడా వరద ఉధృతికి తెగిపోవడంతో ఆ గ్రామ ప్రజలకు ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడిరది. ఇక గోదావరికి దాదాపు 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేయడంతో పశ్చిమగోదావరి జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గోదావరి నీటిమట్టం 43 అడుగులు దాటడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో విలీన మండలాలైన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరం, ఎటపాక, చింతూరు, వీఆర్ పురం, దేవీపట్నం మండలాల్లోని అనేక గ్రామాలు నీటమునిగాయి. చుట్టూ వరద నీరు చేరడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముంపు గ్రామాల ప్రజలను అధికార యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేపడుతున్నారు. కూనవరం మండలం చుట్టూ అనేక గ్రామాలను నీరు కమ్మేసింది. నీరు గంట గంటకు పెరుగుతున్నందున అధికారులు వివిధ గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు. ఎటపాక మండలంలో అనేకచోట్ల రహదారులపై నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వీఆర్ పురంలో వరద ధాటికి చింతూరు మండలానికి వెళ్లే ప్రధాన రహదారి నీట మునగటంతో రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలం మీదుగా ఆంధ్ర నుంచి ఒడిశా వెళ్లే జాతీయ రహదారి నీట మునగడంతో వాహన రాకపోకలను నిలిపివేశారు. దేవీపట్నంలోని దాదాపు 44 గ్రామాలు ఇప్పటికే పూర్తిగా నీట మునిగాయి. గోదావరి నదీ తీరంలో ఉన్న మాతృశ్రీ గండిపోశమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. గోదావరి, శబరి నీటిమట్టాలు మరింత పెరగనున్నట్లు అధికారులు చెబుతూ ఉండడంతో విలీన మండలాల ప్రజలు క్షణక్షణం భయం భయంగా గడుపుతున్నారు. కర్నాటక రాష్ట్రం విజయనగర జిల్లాలోని హాస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్ పైభాగంలోని శివమొగ్గ, హావేరి, మోరల్, కుక్కే సుబ్రహ్మణ్యం ఉడిపి, కుందాపుర తదితర ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షానికి తుంగభద్ర నదికి భారీగా వరద ప్రవాహం వస్తోంది. సుమారు లక్షా 20 వేల క్యూసెక్కుల వరద నీరు డ్యామ్లో చేరుతోంది. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాలన్నింటినీ అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.